ఇక నుంచి శ్రామిక్ రైళ్లలో 1,700 మందికి అనుమతి.. మూడు స్టాప్‌లు

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే శాఖ నడుపుతోన్న విషయం తెలిసిందే. ఈ రైళ్లలో భౌతికదూరం నిబంధనలు పక్కాగా అమలు చేస్తూ కూలీలను తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక్కో రైల్లో 1,200 మంది పంపుతుండగా.. ప్రస్తుతం దానిలో మార్పులు చేసింది. ఇక నుంచి ఒక్కో రైల్లో 1,700 మంది ప్రయాణికులను తరలించాలని అన్ని జోన్‌‌లకు రైల్వే శాఖ ఆదేశాలు జారీచేసింది. అలాగే, రైలు బయలుదేరిన తర్వాత గమ్యస్థానం చేరేలోపు మూడు స్టేషన్‌లలో నిలిపేందుకు అనుమతించింది. రాష్ట్రాల విజ్ఞ‌ప్తి మేరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది.

రైలు సామర్థ్యం స్లీపర్ బెర్తుల సంఖ్యకు సమానంగా ఉండాలని కూడా తెలిపింది. శ్రామిక్ స్పెషల్’ రైళ్లలో 24 బోగీలు ఉండగా.. ప్రతి కోచ్‌లో 72 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉంటుంది. అయితే, ప్రస్తుతం భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ ఒక్కో కోచ్‌లో 54 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. మే 1 నుంచి ఇప్పటి వరకూ 5 లక్షల మంది వలస కూలీలను శ్రామిక్ రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు తరలించారు.

‘రోజుకు 300 రైళ్లు నడపగల సామర్థ్యం ఉండగా.. దానిని గరిష్టంగా పెంచాలనుకుంటున్నాం.. రాబోయే కొద్ది రోజుల్లో వీలైనంత ఎక్కువ మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించాలని తాము కోరుకుంటున్నాం… దీనికి ఆమోదం తెలపాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశాం’ అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞ‌ప్తి మేరకు ప్రత్యేక రైళ్లకు పచ్చ జెండా ఊపిన కేంద్రం.. వలస కార్మికుల తరలింపు బాధ్యతలను ఆయా రాష్ట్రాలకే అప్పగించింది. కనీసం 90% సీట్లు నిండితేనే శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడపాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఈ రైళ్లలో వెళ్లాల్సిన వారిని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించి, వారికి టికెట్లను అందజేసి, ఆ మేరకు డబ్బులు వసూలు చేసి మొత్తం సొమ్మును రైల్వేకు జమ చేయాల్సి ఉంటుంది. అనుమతి పొందినవారే ఈ రైళ్లలో ప్రయాణించేలా ప్రారంభ స్టేషన్‌లో తగినంత భద్రతను రాష్ట్రాలు సమకూర్చాలని, సరైన టికెట్‌ ఉన్నవారే స్టేషన్‌లోకి ప్రవేశించేలా చూడాలని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here