భారత్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 3900 కొత్త కేసులు నమోదు కాగా.. 195 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో ఒకే రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,433కు చేరగా.. మరణాల సంఖ్య 1568కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 32,138 యాక్టివ్ కేసులు ఉండగా… 12,727 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 1020 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మన దేశంలో ఇప్పటి వరకూ 11 లక్షలకుపైగా కోవిడ్ టెస్టులు చేశారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముంబై నగరం కోవిడ్ హాట్స్పాట్గా మారింది. దీంతో ముంబై నగరంలో మే 17 వరకు సెక్షన్ 144 విధించారు. ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ మూడోదశ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మే 17 వరకు లాక్డౌన్ను పొడిగించిన కేంద్రం.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను సడలించింది.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 3.60 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 2.52 లక్షలు దాటింది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 1015 కరోనా మరణాలు సంభవించాయి. గత నెల రోజుల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం.