మే 7 నుంచి స్వదేశానికి భారతీయులు.. ప్రత్యేక విమానాలు, నౌకలు

క రోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు బిగ్ రిలీఫ్. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీల తరలింపునకు కీలక చర్యలు చేపట్టిన కేంద్రం.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను చేపట్టింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని మే 7 నుంచి దశలవారీగా తరలిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం (మే 4) ప్రకటించింది. ఇందు కోసం ప్రత్యేక విమానాలు, నౌకలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. స్వదేశానికి వచ్చేందుకు అయ్యే ఛార్జీలను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ముందుగా స్క్రీనింగ్‌ నిర్వహించి.. ఎలాంటి కరోనా లక్షణాలూ లేవని తేలితేనే ప్రయాణానికి అనుమతి ఇస్తామని హోంశాఖ స్పష్టం చేసింది. గమ్యస్థానాలకు చేరుకున్న వారంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. స్వదేశానికి వచ్చాక వారంతా 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. క్వారంటైన్ గడువు పూర్తయిన తర్వాత వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.

విదేశాల నుంచి వచ్చే వారి కోసం పరీక్షల నిర్వహణ, క్వారంటైన్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సూచించింది. ‘విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు చర్యలు చేపట్టాం. దశవారీగా విమానాల్లో, నౌకల్లో వారిని తీసుకొస్తాం. విదేశాల్లో చిక్కుకున్న వారి వివరాలను భారత రాయభార కార్యాలయాలు, హైకమిషన్లు రూపొందిస్తున్నాయి. చెల్లింపుల ప్రాతిపదికన మే 7 నుంచి దశలవారీగా తరలింపు ప్రక్రియ చేపడతాం’ అని హోం మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here