దాదాపు 48 గంటలపాటు తీవ్రంగా శ్రమించి కనీసం 150 మంది సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు కారణమయ్యాయి. అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ మత సమ్మేళనానికి హాజరుకావడంతో వీరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, యూపీ నుంచి 500 మందికిపైగా మర్కజ్ ప్రార్థనలకు హాజరయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. వీరి ఆచూకీ చెప్పినవారికి రూ.10,000 నజరానా కూడా ఇస్తామని ప్రకటించారు. మరోవైపు, మంగళవారం ప్రారంభమైన మెషీన్.. 48 గంటలపాటు సాగింది. గురువారం నాటికి 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో జమాత్ తబ్లీగ్కు హాజరైన 341 మంది విదేశీయులు సహా 3,204 మందిని అదుపులోకి తీసుకున్నట్టయ్యింది.
తబ్లీగ్ జమాత్కు గుజరాత్ నుంచి హాజరైన కనీసం 10 మందిని కాన్పూర్లో పట్టుకున్నారు. మీరట్ జోన్ పరిధిలోని ముజఫర్నగర్, షామ్లీ, షహారన్పూర్, మీరట్, బాగ్పట్, బులంద్షహర్, ఘజియాబాద్, హపూర్ జిల్లాల్లో 123 మందిని, హత్రాస్, బరేలీలో మిగతావారిని అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 19 రాత్రి నుంచి వీరి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చేపట్టాయి. నైట్ విజన్ డ్రోన్లు సహా అత్యాధునిక పరికరాల సాయంతో జమాతీలను గుర్తించినట్టు మీరట్ జోన్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తమ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న తబ్లిగ్ జమాతీల గురించి వెంటనే తమకు తెలియజేయాలని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సూచించారు… ఒక్క మీరట్ జోన్లోనే 1,400 మందిని గుర్తించామని డీజీపీ తెలిపారు. కాన్పూర్లో గుజరాత్కు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్కు తరలించినట్టు ఐజీ మోహిత్ అగర్వాల్ తెలియజేశారు. నైట్ విజన్ డ్రోన్స్, కెమెరాలు, ఐఐటీ కాన్పూర్ రూపొందించిన అత్యాధునిక పరికరాల సాయంతో జమాతీలను పట్టుకున్నామన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,449కి చేరుకోగా.. 21 మంది ప్రాణాలు కోల్పోయారు.