పాకిస్థాన్ దొంగ బుద్ధి బయట పడింది ..

గత కొంత కాలంగా భారత్ తో ప్రతి చిన్న విషయానికి కాలుదువ్వుతున్న దాయాది దేశం పాకిస్థాన్ తన నీచ స్వభావం మరోసారి బయట పెట్టింది.   కుల్‌‌భూషణ్ జాదవ్‌కు సంబంధించిన మరో వీడియోను పాకిస్థాన్ విడుదల చేసింది. ఈ వీడియోలో జాదవ్ భారత్ వైఖరిని తప్పుబడుతూ, పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. గూఢచర్యం కేసులో పాక్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌తో భారత్‌ను తిట్టించింది.పాక్ జైల్లో ఉన్న కుమారుడిని చూసేందుకు జాదవ్ తల్లి, ఆయన భార్య ఇటీవల పాకిస్థాన్ వెళ్లారు.

ఈ సందర్భంగా కుమారుడిని నేరుగా కలవకుండా ఆంక్షలు పెట్టిన పాక్ అధికారులు జాదవ్ తల్లి మెడలోని మంగళసూత్రాలు, బొట్టును చెరిపివేయించి మరీ కుమారుడిని చూపించింది. దీంతో యావత్ భారత దేశం పాకిస్థాన్ పై విరుచుకుపడింది.  భారత దేశంలో ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రం, బొట్టును తీయించడం తమ మనోభావాలు దెబ్బతిన్నాయని భగ్గుమంది. ప్రపంచవ్యాప్తంగానూ పాక్ తీరును పలువురు దుయ్యబట్టారు.ఈ నేపథ్యంలో గురువారం పాక్ విదేశాంగ శాఖ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. అందులో జాదవ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ అధికారులు తనను బాగా చూసుకుంటున్నారని పేర్కొన్నాడు.

తనను కలిసేందుకు తల్లి, భార్య వచ్చినప్పుడు ఇక్కడి భారత దౌత్య అధికారి (డిప్యూటీ హై కమిషనర్) అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.  ‘నా తల్లి కళ్లలో భయాన్ని చూశాను. నేను భారత నేవీలో పని చేశాను.తర్వాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తరఫున పని చేశా. దీన్ని భారత్ ఎందుకు అంగీకరించడం లేద’ని ప్రశ్నించాడు. తాను ఇప్పటికీ భారత నేవీలో కమిషన్డ్ ఆఫీసర్‌గానే ఉన్నానని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.  తాను గూఢచారిని కాదని భారత్ అబద్ధమాడుతోందని అందులో పేర్కొన్నారు. పాక్ అధికారులు తనను బాగానే చూసుకుంటున్నారన్న విషయం తన తల్లికి అర్థం అయిందని పేర్కొన్నారు.  భారత్‌‌పై పాకిస్థాన్ చేస్తున్న విమర్శలకు అనుగుణంగా జాదవ్ మాటలు ఉండటాన్ని బట్టి ఈ వీడియోను దురుద్దేశ పూర్వకంగానే పాక్ విడుదల చేసిందని అవగతం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here