సాగునీటికి మేఘా పైపులు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వినూత్న నీటిపారుదల ప్రాజెక్టుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ  శ్రీకారం చుట్టింది.  ఆసియాలోనే తొలిసారిగా అవుట్లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓఎమ్ఎస్) ఇజ్రాయేల్ టెక్నాలజీ సహాయంతో పైపుల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ పనిచేస్తోంది. కాళేశ్వరం ప్యాకేజీ-21గా పిలిచే  ఈ కొండం చెరువు ప్రాజెక్టుకు ఇజ్రాయెల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఔట్ లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది.  దీనివలన నీరు ఆవిరి నష్టంగాని, ఇంకుడు నష్టం గాని ఉండదని  మేఘా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్బొంతు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. . ఇప్పటికే పలు దేశాల్లో ఇలాంటి పైప్ లైన్ ఇరిగేషన్ వ్యవస్థకు మంచి ఆదరణ లభించింది. ఈ పైపులు ఏర్పాటు చేసేప్పుడు కొంత ఆటంకం కలిగినా ఆ తర్వాత ఆ పైపులపైన రైతు యధావిధిగా సాగుచేసుకోవచ్చు అని ఆయన వెల్లడించారు.

కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకు అనుగుణంగా మేఘా ఇంజనీరింగ్ ఒకవైపు కాలువలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించడానికి కృషి చేస్తూనే మరోవైపు పైప్లైన్ ఇరిగేషన్ అనే నూతన పధ్ధతిని కూడా అమలు చేయాలనుకుంటుంది. కాలువ ద్వారా వెళ్లే నీరు ఆవిరి కాకుండా పైప్లైన్ ఇరిగేషన్ ద్వారా నేరుగా రైతుల పొలాలకే పైపులతో నీటిని సరఫరా చేసేలా పనులను ప్రయోగాత్మకంగా చేపడుతుంది. ఇలా పైపుల ద్వారా నీటిని పంపించే ఏర్పాటు చేయడం వల్ల భూసేకరణ అవసరం కూడా ఉండదు. ఇప్పటకే పైపుల ద్వారా సాగునీటి సరఫరా విధానం మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్నా.. భారీ స్థాయిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం మాత్రం ఇదే తొలిసారి.

ప్రాజెక్టు ద్వారా మొత్తం 80 వేల హెక్టార్లకు సాగునీటిని అందించే వీలు కలుగుతుంది.  కొండం చెరువు, మంచిప్ప చెరువులను పైప్ లైన్ ద్వారా అనుసంధానం చేయడమే ఈ  ప్రాజెక్టు విశిష్టత. మొత్తం 6,129 కిలోమీటర్ల ప్రెషరైజ్డ్ పైప్ లైన్ నెట్ వర్క్ ను ఎంఎస్, డీఐ, హెచ్డీపీఈ పైపుల ద్వారా ఏర్పాటు చేయనున్నారు. పైపులైన్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమై వేగంగా పనులు జరుగుతున్నాయి.  150 కిలో మీటర్ల ఎంఎస్ పైప్ లైన్ నెట్ వర్క్ ఇప్పటికే 11.4 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. అలాగే 282 కిలో మీటర్ల డీఐ పైప్ లైన్ పనుల్లో 10 కిలోమీటర్లను పూర్తిచేసింది.

ఈ ప్రాజెక్టు పూర్తయితే మెట్ పల్లి ప్రాంతంలో 46,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. అలాగే నిజామాబాదు జిల్లాలోని గడ్కోల్ పంప్ హౌజ్ ద్వారా నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని 34,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. మెట్ పల్లిలోని నిజాంసాగర్ కాలువపై 14.4 కిలోమీటర్ల వద్ద నిర్మించే పంప్ హౌజ్ నుంచి నీరు అందుతుంది.

నిజామాబాదు జిల్లాలోని గడ్కోల్ ప్రాంతంలో 3.5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించి ఆతర్వాత పంపింగ్ చేసే పనులను  మేఘా ఇంజినీరింగ్ పూర్తి చేయనుంది. ఇందుకోసం మేఘా ఇంజినీరింగ్ రెండు పంపింగ్ స్టేషన్లను నిర్మించనుంది. అందులో మొదటిది మెట్ పల్లి వద్ద పదిపంపులతో ఒక్కో పంపు 2.5 మెగావాట్ల సామర్థ్యంతో పంపింగ్ స్టేషన్ నిర్మించనుంది. అలాగే గడ్కోల్ వద్ద 8 పంపులతో ఒక్కో పంపు 2 మెగావాట్ల సామర్థ్యంతో రెండవ పంపింగ్ స్టేషన్ నిర్మించనుంది. పంపింగ్ స్టేషన్ల డిజైన్లు ప్రస్తుతం అనుమతులు పొందే దశలో ఉన్నాయి.

భారీ ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే భవిష్యత్తులో పైపుల ద్వారానే నీటి దుబారా అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైప్ ఇరిగేషన్ ద్వారా చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించవ్చని, ఈ విధానం ద్వారా దిగుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాళేశ్వరంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పైప్లైన్ ఇరిగేషన్ విజయవంతంమైతే ఇతర ప్రాంతాలో కూడా ఇలాంటి ప్రాజెక్ట్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here