దేశంలో కరోనా విజృంభిస్తోంది. రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు కరోనాకు బలవుతూనే ఉన్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనాతో పోరాడుతూ మృతిచెందారు.
కర్ణాటక రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కరోనా సోకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్ణాటకలోని బసవకళ్యాణ్ నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ కు కరోనా సోకగా ఆయన.. సెప్టెంబర్ 1న మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కరోనా సోకిన ఆయనలో తీవ్ర లక్షణాలు కనిపించడంతో వైద్యులు చికిత్సలో భాగంగా ఆయన కోలుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.
అయినప్పటికీ రానురాను ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవలె కర్నాటకలో బీజేపీ ఎంపీ అశోక్ గస్తి చనిపోగా.. తాజాగా నిన్న కేంద్ర మంత్రి సురేష్ అంగడి చనిపోయారు. ఈ వార్త మర్చిపోకముందే మరో ఎమ్మెల్యే కరోనాతో చనిపోవడం విషాదం. దీంతో ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలన్న చర్చ మొదలైంది. ప్రజా క్షేత్రంలో ఉంటూ నిబంధనలు పాటించకపోతే ప్రమాదకరమైన వైరస్ సోకి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా దేశంలో కరోనాతో ఎంపీలు, ఎమ్మెల్యేలు చనిపోవడం బాధాకరం.