ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అమరావతి ప్రాంత రైతులు ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో నాలుగు రోజుల పాటు పర్యటించి కేంద్ర మంత్రులను కలిసి తమ విన్నపాన్ని వివరించారు. అయితే కేంద్ర మంత్రి దీనిపై స్పందిస్తూ అమరావతికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలేను అమరావతి పరిరక్షణ మహిళా ఐకాసా నేతలకు చెప్పారు. దీంతో అమరావతి ప్రాంత వాసుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు తమ డిమాండ్లపై స్పందించిన తీరు చూస్తుంటే కచ్చితంగా అమరావతిలోనే రాజధాని కొనసాగేలా చూస్తారని వారు భావిస్తున్నారు. అయితే ఇందులోని రాజకీయ కోణాన్ని అర్థం చేసుకుంటున్న నేతలు మాత్రం టిడిపి ఉచ్చులో పడొద్దని చెబుతున్నారు.
ఇన్ని రోజులు అమరావతిలో రైతులకు మద్దతు ఇచ్చి పోరాటం చేసిన టిడిపి ఇప్పుడు ఢిల్లీలో కూడా అమరావతి రైతుల పక్షాన పోరాడేందుకు సహాయ సహాకారాలు అందించిందని తెలుస్తోంది. పైగా కేంద్ర మంత్రుల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎలాగూ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఓ క్లారటీ వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం నూతనంగా మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిందని తెలుసు. దీన్ని వ్యతిరేకించాలనుకుంటే ఇప్పటికే ఆ విధంగా చర్యలు ఉండేవి. అయితే అలాంటి పరిస్థితులు లేవు.
రాష్ట్ర ప్రభుత్వానికే రాజధాని నిర్ణయమని.. కేవలం సహకారం అందించేందుకు మాత్రమే తాము ఉంటామని కేంద్రం చెబుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పోరాడినంతవరకు పోరాడామని చివరకు కేంద్రం ఇలా చేస్తుందని అనుకోలేదని టిడిపి నాయకులు చెప్పేందుకు ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో రాష్ట్రంలో వైసీపీని కేంద్రంలో బీజేపీని రెండింటిని బ్యాడ్ చేయొచ్చు కదా అన్న ఆలోచన తెలుగుదేశం చేస్తోందని అంటున్నారు. మరి రాజధాని రైతులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని పోరాటం చేయాలని రాజకీయ మేధావులు సూచనలిస్తున్నారు.