కరోనా టీకా విషయంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలు తలమునకలవుతున్నాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ తీసుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరిపోయింది. సోమవారం నుంచి అమెరికాలో టీకాను అందజేస్తున్నారు. కాగా అమెరికన్లు కరోనా టీకా విషయంలో పలు ఆసక్తికర అభిప్రాయాలు బయటపెట్టారు.
కరోనా టీకా విషయంలో పాశ్చాత్య దేశాల ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు నెలకొన్నాయి. కొంతమంది అయితే కరోనా టీకాలను ప్రభుత్వ కుట్రగా కూడా భావిస్తున్నారు. అందుకే..ప్రజల్లో ఈ అనవసర భయాలను దూరం చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు విస్తృత ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే తాజాగా అమెరికన్ల మనోగతం గురించి మరో ఆసక్తికర కోణం వెలుగులోకి వచ్చింది. కేవలం ఎమర్జెన్సీ అనుమతులు ఉన్న కరోనా టీకాల పట్ల వారు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వేలో.. ఏకంగా 50 శాతం ఇటువంటి అనుమతి మాత్రమే ఉన్న టీకాను వ్యతిరేకించారు.
ఈ విషయమై వర్జీనియా కామన్వెల్త్ యూనివర్శిటీ చేపట్టిన ఓ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. శ్వేతజాతీయులు, నల్లజాతివారు కలిపి మొత్తం 788 మంది అమెరికన్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. టీకాకు కేవలం అత్యవసర అనుమతులు మాత్రమే ఉంటే తాము వ్యాక్సిన్ వేయించుకోమని వీరిలో ఏకంగా 50 శాతం మంది స్పష్టం చేస్తున్నారు. అయితే..పూర్తి స్థాయి అనుమతులు ఉంటే..టీకా విషయమై తాము సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇటీవల కొందరు వలంటీర్లలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతున్నట్టు వస్తున్న వార్తలు వీరిలో అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయట. దీనికి తోడు ప్రభుత్వం ప్రస్తుతానికి కరోనా టీకాకు పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వకపోవడం.. అమెరిన్లు టీకా తీసుకునేందుకు వెనుకాడేలా చేస్తున్నాయని తెలుస్తోంది.