ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఉద్యమం గురించి అందరికీ తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అమరావతి రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు రైతులు చేస్తున్న ఉద్యమం 365 రోజుల ఉద్యమం పూర్తయిన సందర్భంగా అమరావతి రైతులు వరుస కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా బుధవారం అమరావతి ముఖద్వారం అయిన వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు దళిత రైతులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ కన్వీనర్ మార్టిన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయగానే రైతులు రోడ్డుపైకివచ్చి నిరసన తెలిపిన రోజని.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిందన్నారు.
అమరావతి ఉద్యమకారులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదాభివందనం తెలిపారు. అమరావతి ఉద్యమం భావితరాలకు పోరాట స్ఫూర్తినిస్తుందని ట్విట్టర్ వేదికగా లోకేష్ వెల్లడించారు. జై అమరావతి నినాదం అలుపు లేకుండా ఏడాది పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్రం మొత్తం అమరావతి గట్టుకు చేరుకుంటే.. తుగ్లక్ జగన్ మూడు ముక్కలాట వైపు ఉండిపోయారన్నారు. రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతుల పోరాటం వృథా పోదని నారా లోకేష్ పేర్కొన్నారు.