కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం వాడీవేడీగా సాగుతోంది. సోనియా గాంధీ తాను అద్యక్ష్య పదవి నుంచి వైదొలుగుతానని చెబుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలన్నింటిపైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సీనియర్లపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
సమావేశంలో రాహుల్ గాంధీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీని ప్రక్షాళన చేయాలంటూ దేశ వ్యాప్తంగా పలువురు నేతలంతా కలిసి సోనియాకు లేఖ రాశారు. అయితే ఈ విషయం బయటకు లీకవ్వడంతో రాహుల్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని రాహుల్ ప్రశ్నించినట్లు సమాచారం. సోనియాగాంధీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినా ఇలా లేఖలు రాస్తారా అని రాహుల్ అన్నారు.
ఇక సమావేశంలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసమ్మతి నేతలు బీజేపీ ఏజెంట్లలాగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై సీనియర్లు మండిపడ్డారు. మీరు ఆరోపించినట్లు నేను బీజేపీ ఏజెంటునైతే తానే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతానని గులాంనబీ ఆజాద్ అన్నారట. ఇక తామంతా లేఖ రాయడానికి కారణం సీడబ్ల్యూసీ వ్యవహార శైలి అన్నారు. మరో నేత కపిల్ సిబల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్ను నిలబెట్టింది ఎవరన్నారు, మణిపూర్లో బీజేపీని దించి కాంగ్రెస్ను కాపాడిందెవరన్నారు, గత 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా అని ఆయన ట్వీట్ చేశారు.
అనంతరం ఆయన ట్వీట్ను ఉపసంహరించుకున్నారు. అయితే సమావేశంలో ఆ వ్యాఖ్యలు నేను చేయలేదని రాహుల్ గాంధీ నాకు వ్యక్తిగతంగా తెలిపారని.. అందుకే ఆ ట్వీట్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.