ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం కిడ్నీ బాధితుల సమస్యల గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరినడిగినా చెబుతారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మంచినీటి సమస్యను తీర్చేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉద్దానం ప్రాంతంలో శాశ్వత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ఓ పెద్ద ప్రాజెక్టు చేపట్టి రెండేళ్లలోనే దీన్ని పూర్తి చేసి ఈ ప్రాంతానికి శాశ్వతంగా మంచి నీటి సమస్యను తీర్చాలని గవర్నమెంట్ యోచిస్తోంది. ఇందుకోసం రూ. 700 కోట్లతో ప్రాజెక్టు చేపట్టనుంది. ఈ ప్రాంతంలో తాగునీటి కోసం బోరు నీటిపైనే ఆధారపడుతున్నందున వీరికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వీరిని కిడ్నీ వ్యాధుల నుంచి కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లో రెండు మున్సిపాలిటీలు, ఏడు మండలాల్లో 5.74 లక్షల మంది నివసిస్తున్నారు. వీరందరికీ ప్రతి రోజూ వంద లీటర్ల మంచి నీరు అందిచాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఇందుకోసం ఉద్దానం ప్రాంతానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరమండలం రిజర్వాయర్ నుంచి భూగర్బ పైపులైన్ ద్వారా నీటిని మల్లించనన్నారు. మిలియపుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని శుద్ది చేసి ఆ తర్వాత గ్రామాల్లోని రక్షిత మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకులకు సరఫరా చేస్తారు.
ఇందుకోసం ప్రభుత్వం బృహత్ ప్రణాళికను తయారుచేసింది. ఇదే కనుక పూర్తయితే కొన్నేళ్లుగా మంచినీరు లేకుండా జీవిస్తున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు శాశ్వత మంచినీరు దొరికినట్లేనని ప్రజలు చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ పనులను ప్రారంభించనున్నారు.