టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ అంశం తెరమీదకు తీసుకురావడం ఆసక్తిగా మారింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఆయన ఫోన్ ట్యాపింగ్ పై ఇంత రాద్దాంతం చేయడం వెనుక కారణం ప్రధానంగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్ వ్యవహరం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
విజయవాడలోని రమేష్ హాస్పిటల్స్కు సంబంధించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కరోనా పేషెంట్ల కోసం పెట్టిన కోవిడ్ కేర్ సెంటర్లో ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారా అని సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేసులో రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ కుమారును విచారించాలని భావించగా ఆయన తప్పించుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే పది మంది పేషెంట్లు చనిపోవడంతో డాక్టర్ రమేష్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిందని చెప్పాలి. దీంతో ఈ వ్యవహారాన్ని ఎలాగైనా పక్కదారి పట్టించాలని చంద్రబాబు పక్కాగా ప్లాన్ వేసినట్లు పలువురు చెబుతున్నారు. అసలు తప్పు చెయ్యకపోతే డాక్టర్ రమేష్ ఎందుకు పరారీలో ఉన్నారన్న ప్రశ్నలు సాధారణంగానే వస్తున్నాయి. పైగా ఈ విషయంలో కులం ప్రస్తావించడం కూడా కేవలం రాజకీయంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని చెడు చేయాలనే ఉద్దేశం ఉందని తెలుస్తోంది.
పది మంది ప్రాణాలు గాలిలో కలిసేందుకు కచ్చితంగా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమని తెలుస్తోంది. దీంతో డాక్టర్ రమేష్ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి సన్నిహితుడైన రమేష్ను ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకోసమే ఈ టాపిక్ నుంచి రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేసి ఫోన్ ట్యాపింగ్ లాంటి ఇంట్రస్టింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెలుస్తోంది.
ఇక నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే స్థానిక పోలీసులకు కానీ, రాష్ట్ర డీజీపీకి కానీ, లేదా కేంద్ర హోంశాఖకు కానీ ఆధారాలతో సహా చంద్రబాబు ఫిర్యాదు చేసి ఉండేవారు. ఎందుకంటే ఏమీ లేనప్పుడే ఇంత హడావిడి చేసే చంద్రబాబు నిజంగా ట్యాపింగ్ జరిగింటే ఆధారాలతో ఈ పాటికే హల్చల్ చేసేవారు. కానీ ఇక్కడ ఓన్లీ ప్రధానికి లేఖ రాయడం మాత్రమే చంద్రబాబు చేశారు. అదీ కూడా అధికార పార్టీ వారు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని మాత్రమే అందులో పేర్కొన్నారు.
ఇవన్నీ బట్టి చూస్తే కేవలం రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన రమేష్ హాస్పిటల్స్ విషయం నుంచి ప్రజలను ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి అనవసరమైన ఫోన ట్యాపింగ్ వ్యవహారం తెచ్చారనిపిస్తోంది. మరి ఒక వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుకు చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారా అనిపిస్తోంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పది మంది చనిపోతే దీనిపై బాద్యత గల ప్రతిపక్షంగా ముందుండి తప్పుచేసిన వారిని శిక్షించాల్సింది పోయి ఇలా ఇష్యూని కప్పిపుచ్చేందుకు కులం రంగు పూయడం, ఫోన్ ట్యాపింగ్ అనే కొత్త అంశం తెరమీదకు తీసుకురావడం నిజంగా సభ్యసమాజం తలదించుకునేలా ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.