కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా రోగుల నుంచి సేకరించిన ప్లాస్మాను తీసుకొని కరోనా చికత్సలో వాడుతున్నారు. దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఎంతో మంది ప్లాస్మాను దానం చేయడానికి ముందుకు వస్తున్నాయి.
అయితే మనుషుల ప్లాస్మానే కాకుండా గుర్రాల నుంచి సేకరించిన ప్లాస్మాను కూడా చికిత్సకు వాడొచ్చని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న బయోలాజికల్ ఈ సంస్థ చెబుతోంది. వీరు చేసిన పరిశోధనల్లో దీన్ని కనుగొన్నారు. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్ను గుర్రాల్లోకి ఎక్కించారు. 21 రోజుల తర్వాత గుర్రాల్లోని ప్లాస్మాను బయటకు తీసి పరీక్షించారు. దీనిలో మనుషుల్లోని ప్లాస్మా కంటే శక్తివంతమైన యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ యాంటీ బాడీలు కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో వేగంగా పనిచేస్తాయని తెలుస్తోంది.
మొదట 10 గుర్రాలపై ఈ ప్రయోగం చేశారు. అయితే దీనిపై ఇంకా ప్రయోగాలు జరగాల్సి ఉందని తెలుస్తోంది. ఐసీఎంఆర్ ఈ విషయంపై త్వరలోనే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను కలువనుంది. కరోనా రోగుల నుంచి తీసిన రక్తంలోని యాంటీ బాడీల కంటే గుర్రం సీరమ్లో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఈ విషయంలో శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.