విశాఖలో టీడీపీ నేత సబ్బం హరి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాలంటూ అధికారులు కూల్చివేయడం వివాదాస్పదంగా మారుతోంది. హరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ రూమ్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులుపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సమస్యను 24 గంటల్లో క్లోజ్ చేస్తానని ఆయన అన్నారు. విజయసాయిరెడ్డి విశాఖలో కూర్చొని డ్యాన్స్ వేద్దామని అనుకుంటున్నారని.. ఆయన డ్యాన్స్ను ఆట కట్టిస్తానన్నారు. తన గురించి సీఎం జగన్కు తెలుసని హరి అన్నారు. బహుషా విజయసాయిరెడ్డికి ఇంకా తెలియదని అనుకుంటానన్నారు. తనను ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు ఇలాంటి పని చేశానా అని అనుకునేలా చేస్తానని ఆయన ఆగ్రహంగా మాట్లాడారు.
కాగా ప్రభుత్వ స్థలంలో సబ్బం హరి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న కారణంతో అధికారులు ఈ గోడను కూల్చివేశారు. గతంలో నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా జేసీబీతో వచ్చి కూల్చివేయడంతో సబ్బం హరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ విషయంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనపై ప్రశ్నించినందుకే సబ్బం హరి ఇంటిని కూల్చివేస్తున్నారని అంటున్నారు. వైకాపా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.