కరోనా మహమ్మారి భారత్లో విజృంభిస్తూనే ఉంది. తాజాగా కరోనా మరణాల్లో భారత్ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో కరోనా మరణాలున్న దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఇంకెన్ని మరణాలు నమోదవుతాయోనన్న ఆందోళన నెలకొంది.
కరోనా మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 2,08,690 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 1,44,680 మరణాలు బ్రెజిల్లో నమోదయ్యాయి. ఇక ఇండియాలో 1,00,842 మంది కరోనాతో చనిపోయారు. నేడు ఒక్క రోజు 1069 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇండియా కరోనా మరణాల్లో మూడో స్థానంలోకి వచ్చింది. ప్రపంచంలో చనిపోతున్న ప్రతి పది మందిలో భారత్లో ఒక్కరు చనిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 10 లక్షల మంది చనిపోయారు.
కరోనా విజృంభించిన మొదట్లో మరణాలు ఎక్కువగా లేవు. ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే 50 శాతానికి పైగా మరణించారు. ఇక ప్రపంచంలో కరోనా కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్లో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. టెస్టుల సంఖ్య కూడా ఇండియాలో ఎక్కువగానే ఉంది. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఈ నివేదికలు చూస్తే అర్థమవుతోంది. కరోనాపై కేంద్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.