అభిమానికి హితబోధ చేసిన బన్నీ..!

హీరోలకు అభిమానులపై ఎంతో ప్రేమ ఉంటుంది. తమను ఎంతగానో అభిమానించే వారి కోసం మంచి సినిమాలు చేయాలి, వారితో శభాష్‌ అనిపించుకోవాలని భావిస్తుంటారు. అయితే అదే అభిమానం శృతి మించితే హీరోలు అప్పుడప్పుడు అసహనానికి గురవుతుంటారు. తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా అలాంటి అసహనానికే గురయ్యాడు. తన కోసం ఏకంగా 200 కి.మీలు నడుచుకుంటూ వచ్చిన అభిమానికి హితబోధ చేశాడు.

వివరల్లోకి వెళితే.. మాచర్ల గ్రామం కమ్మం పాడుకు చెందిన నాగేశ్వరరావు అనే బన్నీ అభిమాని ఏకంగా 200 కి.మీ దూరం నడిచి బన్నీని కలుసుకున్నాడు. ఇతన్ని అల్లు అర్జున్‌ టీం కలుసుకొని శుక్రవారం సాయంత్రం బన్నీకి కల్పించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ నాగేశ్వరరావు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. తన కోసం ఓ వ్యక్తి అంత దూరం నడిచి రావడం పట్ల ఒకింత సంతోషం వ్యక్తం చేసినా మరో పక్క ఇంత రిస్క్‌ తీసుకోవడం పట్ల బన్నీ కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ విషయమై నాగేశ్వరరావుతో మాట్లాడుతూ.. ‘మాస్కు వేసుకొని వచ్చావు బాగుంది. చాలా కష్టపడి ఇంత దూరం వచ్చావు బాగుంది.. నా మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది కానీ, ఇలా నడిచి రావడం చాలా బాధగా ఉంది. మీ భవిష్యత్తు కోసమో మీ కుటుంబం కోసమో చేస్తే నేను అప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటా. దయచేసి ఇంకొసారి ఇలా చెయ్యాలనుకుంటే మాత్రం నీకోసం, నీ కుటుంబం కోసం చేయు’ అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. తన కోసం అంత దూరం వచ్చిన అభిమానికి గుర్తుగా ఒక మొక్కను, AA లోగోతో ఉన్న మాస్కులను బహుమతిగా ఇచ్చాడు. చూశారుగా.. అభిమానం కొంతమేర ఉంటే పర్లేదు కానీ ఇలా మితిమీరితేనే.. అది మనం అభిమానించే వారికి కూడా రుచించదు కాబట్టి అభిమానం హద్దుల్లో ఉంటేనే అందంగా ఉంటుందని చెప్పకనే చెప్పాడు బన్నీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here