భార్య నుంచి విడాకులు తీసుకున్న భర్త ఆమెకు భరణమిచ్చేందుకు ఏకంగా కిడ్నీని విక్రాయానికి పెట్టడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. విదిశలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే…విదిశలో ప్లంబర్ గా జీవనం సాగిస్తున్న వ్యక్తి తన భార్యతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నాడు. దీంతో తన పోషణకు సహాయం చేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా భరణం చెల్లించాలంటూ న్యాయస్ధానం అతనిని ఆదేశించింది.
దీంతో ఆయన తన కిడ్నీ విక్రయిస్తానంటూ పేపర్ లో ప్రకటన కూడా ఇచ్చాడు. దీనిని చూసిన పలువురు అతనికి ఫోన్ చేసి బేరమాడుతుండగా, 50 లక్షల రూపాయలు చెల్లిస్తేనే కిడ్నీ విక్రయిస్తానని స్పష్టం చేస్తున్నాడు. దీంతో కిడ్నీ కొనేందుకు ఉత్సాహం చూపినా ధర వినివెనకడుగేస్తున్నారు. దీంతో అతను మీడియాను ఆశ్రయించాడు.
తన దగ్గర భార్యకు ఇచ్చేందుకు డబ్బుల్లేవని, కిడ్నీ విక్రయానికి పెట్టినా ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది టెలికాస్ట్ కావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.