బీఎస్‌ఎఫ్‌లో కరోనా అలజడి.. 14 మంది జవాన్లు క్వారంటైన్‌కు

బీ ఎస్‌ఎఫ్‌కు చెందిన 14 మంది జవాన్లను క్వారంటైన్‌కు తరలించారు. వీరితో కలిసి పనిచేసిన ఓ పోలీస్ వంట మనిషికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో బీఎస్‌ఎఫ్‌లో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు జవాన్లను క్వారంటైన్‌కు తరలించి వారి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్) చెందిన 14 మంది జవాన్లు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇటీవల ఆగ్రాలో విధులు నిర్వహించారు. అక్కడ పోలీసులకు సాయంగా 20 రోజుల పాటు పనిచేశారు. దేశంలోని కరోనా హాట్‌స్పాట్లలో ఒకటి.

ఆగ్రాలో విధులు నిర్వహించిన జవాన్లకు స్థానికంగా ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. వారికి పోలీసు శాఖ నుంచి ఓ వంట మనిషిని నియమించారు. అయితే.. ఆ వంట చేసిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో జవాన్లందరినీ అప్రమత్తం చేశారు. ఆర్మీ వాహనంలో వీరంతా శనివారం (ఏప్రిల్ 25) సాయంత్రమే ఆగ్రా నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్‌ పట్టణానికి చేరుకున్నారు.

బిలాయ్ చేరుకున్న 12 మంది జవాన్లను బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించగా.. దుర్గ్ జిల్లాకు వెళ్లిన మరో ఇద్దరు జవాన్లను అక్కడే క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. వీరి పరీక్షలకు సంబంధించిన నివేదికలు అందాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

కరోనా వైరస్ భారత సైన్యంలో వ్యాపించకుండా అధికారులు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇండియన్ నేవీలో 25 మందికి, ఆర్మీలో ఎనిమిది మందికి వైరస్‌ సోకింది. ప్రస్తుతం వీరంతా ఆయా ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన జవాన్లు కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు సమర్పించిన తర్వాతే తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో జనగామ జిల్లాలో ఓ జవాన్ కరోనా వైరస్ బారిన పడినట్లు తేలింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here