13 రాష్ట్రాల్లో ‘0’ కేసులు.. దేశంలో 53 వేలకు చేరువలో కరోనా కేసులు

గ డిచిన 24 గంటల్లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. గడిచిన 21 నుంచి 28 రోజుల్లో దేశంలోని 136 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ గురువారం (మే 7) తెలిపారు. గురువారం కరోనా కేసులు నమోదు కాని రాష్ట్రాల్లో కేరళ, ఒడిశా, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గత 24 గంటల్లో దేశంలో 3,561 కరోనా కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో 1084 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. తాజా కేసులతో భారత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 53 వేలకు చేరువైంది.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో రికవరీ రేటు మెరుగైన దశలో ఉందని మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. మరణాల శాతం చాలా తక్కువగా ఉందని చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం కరోనా మరణాల రేటు 3.3 శాతంగా, రికవరీ రేటు 28.83 శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

గురువారం నమోదైన కేసులతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 52,952కు ఎగబాకింది. కరోనా మరణాల సంఖ్య 1,783కు చేరింది. దేశంలో ప్రస్తుతం 35,902 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా నుంచి 15,266 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

బుధవారం నాటికి దేశంలో 49,391 కరోనా కేసులు ఉండగా.. గురువారం ఈ సంఖ్య 50 వేల మార్కును దాటి, 53 వేలకు చేరువైంది. కరోనాతో గత 24 గంటల్లో మరో 89 మంది మరణించారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. ముంబైలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here