మందుబాబుల సేఫ్టీ కోసం ‘మహా’ సర్కారు వినూత్న నిర్ణయం

మందుబాబుల సేఫ్టీ కోసం సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. లిక్కర్ కోసం మద్యం షాపుల ముందు భారీగా గుమికూడుతుండటం.. మరోవైపు కరోనా వీరవిజృంభణ చేస్తుండటంతో.. ఈ-టోకెన్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా నాసిక్, పుణేల్లో ఆదివారం నుంచి ఆన్‌లైన్ టోకెన్ విధానాన్ని ప్రారంభించనుంది. దీని ప్రకారం మద్యం కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్సైజ్ విభాగం పోర్టల్‌లోకి వెళ్లి.. రిజిస్టర్ చేసుకుంటే టోకెన్ వస్తుంది. దాని సాయంతో వైన్స్ షాపుకెళ్లి మద్యం కొనుగోలు చేయొచ్చని సీనియర్ అధికారులు తెలిపారు.

ఈ-టోకెన్ విధానం కోసం పుణే, నాసిక్ ప్రాంతాల్లోని హోల్‌సేలర్స్ అసోసియేషన్ యాప్‌ను డెవలప్ చేసింది. మద్యం కొనుగోలు చేయాలనుకునే వారు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే వచ్చే టైం స్లాట్ ఆధారంగా సమీపంలోని లిక్కర్ షాపుకెళ్లి మద్యం కొనుగోలు చేయొచ్చు. ఈ విధానం వల్ల టోకెన్ పొందిన వారు తమకు కేటాయించిన టైంలోనే మద్యం కొనుగోలు చేస్తారు. దీంతో మద్యం దుకాణాల మందు భారీ క్యూ లైన్లు తప్పుతాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.

పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే మహారాష్ట్ర అంతటా అమలు చేస్తామని ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. వీధుల్లోకి జనం ఎక్కువగా రాకుండా పరిమిత సంఖ్యలోనే ఈ-టోకెన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కుదిరితే మద్యం డోర్ డెలివరీ ప్రారంభించాలని కూడా మహా సర్కారు భావిస్తోంది. ఈ టోకెన్ విధానం ఢిల్లీలో అమల్లో ఉండగా… లిక్కర్ డోర్ డెలివరీకి పంజాబ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here