విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సోమవారం రాత్రి నలుగురు మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ఎంపీ విజయ సాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో నిద్ర చేశారు. బాధిత గ్రామంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఆరుబయట నిద్రించారు. మంగళవారం ఉదయం ప్రభావిత గ్రామాల్లో మంత్రులు, ఎంపీలు పర్యటించి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంటింటా పర్యటించి ధైర్యం చెప్పారు.
ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు పరిహారం ఇవ్వడమే కాదు.. భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని తెలిపారు.ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని చెప్పారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తి సేప్ అండ్ గ్రీన్ జోన్గా తయారు చేస్తామన్నారు. పశువుల కోసం 25 టన్నుల పశుగ్రాసం సరఫరా చేస్తున్నామని తెలిపారు. గ్రామస్తులకు మధ్యాహ్నం, సాయంత్రం భోజనం ఏర్పాటు చేస్తామన్నారు.ఈ ప్రాంతమంతా మామూలు పరిస్థితికి వచ్చేంత వరకు ప్రభుత్వమే బాధ్యతగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాను విశాఖను దత్తత తీసుకున్నానని, ఈ ప్రాంతానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఘటన జరిగిన రోజు సీఎం వైయస్ జగన్ వెంట హెలికాప్టర్లో రావడానికి ప్లేస్ లేక ఆగిపోయానని, హెల్త్ మినిస్టర్ ఆళ్లనాని ఇక్కడి రావడం ఉపయోగకరం కాబట్టే తాను ఆ రోజు ఆగిపోయానని, దీన్ని ప్రతిపక్షాలు చిలువలు పలువలుగా చిత్రీకరించడం సరికాదని సూచించారు.