దేవుడికి చాలా పనుంది.. కరోనాపై ఉగాండా అధ్యక్షుడి అద్భుత ప్రసంగం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చాలా దేశాలు కోరుతున్నాయి. కానీ ఆకతాయిలు మాత్రం అనవసరంగా రోడ్లెక్కుతుండగా.. కొందరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ ఆదేశాలను పాటించాలని ప్రభుత్వాలు పదే పదే కోరుతున్నా.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ.. పోలీసులు, ప్రభుత్వాలకు తలనొప్పిలా మారారు. ఇలాంటి వారికి ఆఫ్రికా దేశమైన కగుటా ముసెవెని కనువిప్పు కలిగేలా ఓ వార్నింగ్ ఇచ్చారు. ‘దేవుడికి చాలా పని ఉంది. ఇక్కడ ఉన్న మూర్ఖులను చూసుకోవడం కోసం ఉగాండాలోనే కాదు.. ప్రపంచం మొత్తాన్ని ఆయనే చూసుకోవాలి’ అని రూల్స్ బ్రేక్ చేస్తున్న వారికి కగుటా చురకలు అంటించారు.

‘‘యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఇంట్లో ఉండండని ఎవరూ చెప్పరు. మీ ఇష్టం మేరకే ఇంటికి పరిమితం అవుతారు. ఒకవేళ మీ ఇంటికి బేస్‌మెంట్ ఉంటే.. ప్రాణాలను కాపాడుకోవడం కోసం యుద్ధం ముగిసే వరకూ అందులోనే దాక్కుంటారు కదా. యుద్ధం వేళ ఎవరూ స్వేచ్ఛ కోసం పట్టుబట్టరు. బతకడం కోసం స్వేచ్ఛ సంగతిని పక్కనబెడతారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఆకలి గురించి ఎవరూ ఫిర్యాదు చేయరు. ఆకలి బాధిస్తున్నా సరే.. దేవుడా నన్ను బతికించూ అని కోరుకుంటారు.

యుద్ధం జరుగుతున్నప్పుడు నన్ను వ్యాపారం చేసుకోనీయండి అని వాదించరు కదా. షాప్ మూసివేసి ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతారు. బతికి ఉంటే చాలు యుద్ధం తర్వాత షాప్ తెరవొచ్చనుకుంటారు. యుద్ధం జరుగుతున్నప్పుడు మరో రోజును చూడగలిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతారు. యుద్ధం వేళ.. మీ పిల్లలు బడికెళ్లడం లేదని బాధపడరు. వాళ్లను ప్రభుత్వం బలవంతంగా సైన్యంలోకి తీసుకోవద్దని ప్రార్థిస్తారు.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం యుద్ధం లాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. తుపాకులు, బుల్లెట్లు లేని యుద్ధం ఇది. సైనికులు లేని రణమిది. సరిహద్దులు లేని పోరు ఇది. కాల్పుల విరమణ ఒప్పందాల్లేని యుద్ధమిది. ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాని రణక్షేత్రమిది.

ఈ యుద్ధంలో శత్రు సైన్యానికి ఎలాంటి దయా లేదు. మానవత్వం అస్సలు లేదు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లనే బేధం లేదు. ప్రార్థనా మందిరాల గురించి కానీ, మతం పట్ల కానీ, భూగర్భంలోని ఖనిజ సంపద గురించి కానీ దీనికి ఏ మాత్రం పట్టదు. కంటికి కనిపించని ఈ శత్రుసైన్యం క్రూరమైంది. దీని అజెండా ప్రాణాలను హరించడమే. ప్రపంచం మొత్తాన్ని శవాల దిబ్బగా మార్చేశాకే ఇది శాంతిస్తుంది. యుద్ధ క్షేత్రం లేనప్పటికీ.. ప్రతి దేశంలోనూ దీనికి బేస్ ఉంది. దాని కదలికలను ఏ యుద్ధ ఒప్పందం కూడా ఆపలేదు. అదే .

కానీ ఈ ఆర్మీకి ఓ బలహీనత ఉంది. ఆ బలహీనతతోనే దాన్ని అడ్డుకోవచ్చు. కలిసికట్టుగా, క్రమశిక్షణతో, ఓర్పుతో ఉండటమే మనం చేయాల్సింది. సోషల్ డిస్టెన్సింగ్‌ పాటిస్తే కోవిడ్-19 బతకలేదు. ఎదురు పడితేనే ఈ వైరస్ విజృంభిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ మహమ్మారి మోకరిల్లుతుంది. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం వల్ల ఇది నిస్సహాయురాలు అవుతుంది.

చిన్నపిల్లల్లా అన్నం కోసమో, ఇతర అవసరాల కోసమో ఏడవాల్సిన సమయం కాదిది. కేవలం రొట్టెలతోనే మనిషి బతకలేడని పవిత్ర గ్రంథం చెబుతోంది. అధికారులు చెప్పే సూచనలను పాటిద్దాం. కోవిడ్‌ను నియంత్రిద్దాం. సహనాన్ని అలవర్చుకుందాం. ఇలా చేస్తే మళ్లీ మన స్వేచ్ఛను తిరిగి పొందొచ్చు. అందరం కలిసిపోవచ్చు’’ అని ఉగాండా అధ్యక్షుడు జాతిని ఉద్దేశించి ఇటీవల ప్రసంగించారు.

ఇంతకూ ఆ దేశంలో నమోదైన కేసులు ఎన్నో తెలుసా కేవలం 75. యాక్టివ్ కేసులు 29 మాత్రమే. కోవిడ్ బారిన పడి ఇప్పటి వరకూ అక్కడ ప్రాణ నష్టం వాటిల్లలేదు. అలాంటి దేశంలోనే అధినేత ఇంతగా చెబుతున్నారంటే.. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఓసారి ఆలోచించుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here