గబ్బిలాల మృతి, మీరట్‌లో అలజడి.. మిస్టరీగా పలు ప్రశ్నలు, ఏమైనట్టు?

క రోనా వైరస్‌ భయం వెంటాడుతున్న వేళ యూపీలోని ఓ గ్రామంలో గబ్బిలాలు వరుసగా మృత్యువాత పడటం కలకలం రేపింది. గ్రామంలోని ఓ నీటి కుంట వద్ద రెండు రోజుల్లో పలు గబ్బిలాలు మృత్యువాతపడ్డాయి. గబ్బిలాలతో కరోనా వైరస్ సోకుతుందనే వార్తలతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వాటి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి పలు పరీక్షలు నిర్వహించారు. ఆ గబ్బిలాలన్నీ కరెంట్ షాక్‌కు గురై మరణించాయని అధికారులు చెబుతుండగా.. గ్రామస్థులు లేవనెత్తిన పలు అంశాలు మిస్టరీగా మారాయి.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నగర శివారులోని మెహ్రోలీ గ్రామంలో ఓ నీటిగుంటలో ఏప్రిల్‌ 29న గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. గబ్బిలాలు చనిపోయి ఉండటాన్ని గమనించి గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ అధికారి అతిథి శర్మ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మరణించిన గబ్బిలాల నమూనాలను బరేలిలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవీఆర్‌ఐ)కి పంపించారు.

ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుండగానే.. ఏప్రిల్ 30న మరిన్ని గబ్బిలాలు మృతి చెందాయి. దీంతో గ్రామంలో మరింత కలకలం రేపింది. గ్రామ సమీపంలోని పండ్ల తోటల్లో రసాయనాలు ఎక్కువ మోతాదులో చల్లడం వల్ల ఆ చెట్ల వైపు వెళ్లిన గబ్బిలాలు మృత్యువాత పడిఉంటాయని అధికారులు తొలుత భావించారు. తాజాగా ఈ అంశంపై పరిశోధన జరిపిన ఐవీఆర్‌ఐ శాస్త్రవేత్తలు అందుకు కారణం రసాయనాలు కాదని వివరణ ఇచ్చారు. హై ఓల్టేజ్ కరెంట్‌ షాక్‌ తగిలినందు వల్లే ఆ గబ్బిలాలు మృత్యువాత పడ్డాయని తెలిపారు.

ఎలక్ట్రిక్‌ షాక్‌ వల్లే ఈ ఘటన జరిగిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అటవీ శాఖ అధికారి అతిథి శర్మ పేర్కొన్నారు. కానీ, మెహ్రోలి గ్రామస్థులు మాత్రం అధికారులు, శాస్త్రవేత్తల మాటలతో ఏకీభవించడం లేదు. షాక్‌ కొట్టడం వల్లే గబ్బిలాలు చనిపోయాయనే వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు కూడా బలంగానే ఉన్నాయి.

గబ్బిలాల కళేబరాలు లభించిన ప్రాంతానికి అర కిలోమీటరు దూరం వరకు ఎలాంటి విద్యుత్ లైన్‌ లేదని గ్రామస్థులు వాదిస్తున్నారు. ఒకవేళ షాక్ కొట్టిన మాట నిజమే అయితే.. అక్కడే ఉన్న ఇతర జంతువులు ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా.. వరసగా రెండు రోజులు షాక్ కొట్టడం వల్లే గబ్బిలాలు చనిపోయాయనే అంశం నమ్మశక్యంగా లేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ విషయాన్ని తేలికగా కొట్టిపారేయొద్దని.. తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని అధికారులను కోరుతున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here