కరోనా వ్యాప్తిపై పోరులో న్యూజిలాండ్ విజయం.. ప్రధాని జెసిండా కీలక ప్రకటన

వ్యాప్తిని అడ్డుకోవడంలో తాము విజయం సాధించామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సోమవారం ప్రకటించారు. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామని ఆమె పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లో వైరస్ విస్తృత, సామూహిక వ్యాప్తి చెందినట్టు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. మహమ్మారిపై పోరులో విజయం సాధించామని జెసిండా ఉద్ఘాటించారు. దేశంలో వైరస్ కేసులు వెలుగుచూసిన వెంటనే న్యూజిలాండ్‌ ప్రభుత్వం మేల్కొంది. లాక్‌డౌన్ ప్రకటనకు రెండు రోజుల ముందే ప్రజలను సిద్ధం చేశారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా నాలుగువారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు.

అంతేకాదు, ఒకవేళ మీకు కరోనా వైరస్‌ సోకితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో ప్రస్తుతం అలాగే మసులుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసి.. పై నిర్లక్ష్యం వహించకుండా వైరస్‌ సోకిందనే భావనతోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చి… నాలుగు స్థాయిల్లో ఆంక్షలను అమలు చేశారు. దాదాపు ఐదు వారాలుగా అక్కడ లాక్‌డౌన్ కొనసాగుతోంది. సోమవారం నుంచి మూడు స్థాయిలకు తగ్గించనున్నారు. వ్యాపార కార్యకలాపాలు, ఆహారం పార్సిల్స్, పాఠశాలల పునఃప్రారంభానికి అనుమతించారు.

వైరస్‌ను పూర్తిగా నిర్మూలించామని ఖచ్చితంగా చెప్పలేమని, సాధారణ పరిస్థితులకు రావడానికి కొంత సమయం పడుతుందని హెచ్చరించారు. వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ కోల్పోయిన సామాజిక సంబంధాలను తిరిగి పొందాలని కోరుకుంటున్నాం.. కానీ ఇది నిదానంగా జరుగుతుందని, అప్పటి వరకూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. న్యూజిలాండ్ ప్రజం ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ చేయబోనని, కాబట్టి మనం మూడో స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. గడచిన 24 గంటల్లో న్యూజిలాండ్‌లో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదయ్యింది. మొత్తం 1,122 మంది వైరస్ బారినపడగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here