స్వల్ప లక్షణాలుండి.. మూడు రోజులు జ్వరం రాకుంటే ఇంటికి పంపొచ్చు: కేంద్రం

లక్షణాలు స్వల్పంగా ఉన్న బాధితులకు పది రోజుల తర్వాత వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకపోతే ఆస్పత్రి నుంచి ఇంటికి పంపొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనికి పరీక్షలు కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మాత్రం లక్షణాలు పూర్తిగా తగ్గి, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించి, నెగెటివ్‌ వస్తేనే పంపాలని పేర్కొంది. మార్గదర్శకాలు సవరించిన కేంద్ర ఆరోగ్య శాఖ..ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.

స్వల్ప/ అతి స్వల్ప/ ముందస్తు లక్షణాలున్న వారిని కరోనా కేర్ సెంటర్‌లో చేర్చి తరచూ శరీర ఉష్ణోగ్రత, నాడిని పర్యవేక్షించాలి. లక్షణాలు కనిపించిన 10 రోజుల తర్వాత వరసగా మూడు రోజులు జ్వరం రాకపోతే డిశ్ఛార్జ్ చేయొచ్చు. ఆ తర్వాత మరో ఏడు రోజులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించాలి.

ఒకవేళ, డిశ్ఛార్జికి ముందు ఆక్సిజన్‌ స్థాయి 95% కంటే తక్కువకు పడిపోతే వెంటనే ప్రత్యేక ‘కోవిడ్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌’కు తరలించాలి. అలాగే, ఇంటికి వెళ్లిన తర్వాత జ్వరం, దగ్గు, శ్వాసపరమైన సమస్యలు తలెత్తినవారు వెంటనే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా హెల్ప్‌లైన్‌ నంబరు 1075ను సంప్రదించాలి. కోలుకుని ఇంటికెళ్లిన తర్వాత వారి ఆరోగ్యాన్ని 14వ రోజున టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా తెలుసుకోవాలి.

మూడు రోజుల్లోపు లక్షణాలు తగ్గిపోయి, తరువాత నాలుగు రోజులపాటు ఆక్సిజన్‌ స్థాయి 95% పైగా ఉన్న వారిని ఒక మోస్తరు తీవ్రత ఉన్న (మోడరేట్‌) కేసుల కింద పరిగణిస్తారు. ఇలాంటి వారి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయిని నిరంతరం పర్యవేక్షించాలి.

మూడు రోజుల్లో జ్వరం తగ్గిపోయి, వరసగా నాలుగు రోజుల పాటు ఆక్సిజన్‌ అవసరం లేకుంటే వారిని.. లక్షణాలు కనిపించిననాటి నుంచి పదిరోజుల తర్వాత ఇంటికి పపొచ్చని తెలిపింది. డిశ్ఛార్జి చేసే ముందు మళ్లీ పరీక్షలు అవసరంలేదని, ఇంటికెళ్లిన తర్వాత ఏడు రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది.

ఆక్సిజన్‌ అవసరమైన వారిని మాత్రం లక్షణాలన్నీ తగ్గిపోయిన తర్వాతే డిశ్ఛార్జి చేయాలి. వరసగా మూడురోజులు ఆక్సిజన్‌ అవసరం లేకుండా వారు ఉండగలగాలి.

హెచ్‌ఐవీ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, కేన్సర్‌ రోగులు వంటివారిని క్లినికల్‌ రికవరీ ఆధారంగా డిశ్చార్జి చేయాలి. లక్షణాలన్నీ తగ్గిపోయిన తర్వాత ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించి, అందులో నెగెటివ్‌ వస్తేనే ఇంటికి పంపాలి.

శనివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 15.23 లక్షల నమూనాలను పరీక్షించినట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 332 ప్రభుత్వ, 121 ప్రయివేట్ ల్యాబ్‌లలో రోజుకు 95,000 పరీక్షించే స్థాయికి చేరినట్టు వెల్లడించింది. మరోవైపు, దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here