లాయర్లకు మినహాయింపు ఇవ్వలేం.. కేరళ హైకోర్టుకు కేంద్రం

మహమ్మారి వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ నుంచి న్యాయవాదులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని కేరళ హైకోర్టుకు కేంద్రం శుక్రవారం తెలియజేసింది. లాక్‌డౌన్ సమయంలో తమ ఛాంబర్లలోకి అనుమతించాలని కోరుతూ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయం వెల్లడించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ దేవన్ రామచంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. లాక్‌డౌన్ సమయంలో లాయర్లను ఛాంబర్లలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 3కి వాయిదా వేసింది.

లాక్‌డౌన్ సమయంలో న్యాయవాదులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి సమయంలో ఒకవేళ వారికి అనుమతిస్తే అనేక మంది ప్రజలు రోడ్ల మీదకు వస్తారని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో కేంద్రం అఫిడ్‌విట్ దాఖలు చేసింది. కేంద్రం మార్గదర్శకాలను కేరళ ప్రభుత్వం పాటిస్తోందని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. లాక్‌డౌన్ నుంచి కొన్ని రంగాలకు కేంద్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా హాట్‌స్పాట్స్ కాని ప్రాంతాల్లో కార్యకలాపాలు ఏప్రిల్ 20న ప్రారంభమయ్యాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ దాని అనుబంధ రంగాలు… మార్కెటింగ్‌, ఆహారశుద్ధి పరిశ్రమల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. వీటితోపాటు మునిసిపల్‌ పరిధి బయట ఉన్న ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేని 353 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి పనులు మొదలయ్యాయి. మిగతా 377 జిల్లాల్లో కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పనులకు వెసులుబాటు లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here