భోపాల్ విషాదాన్ని గుర్తు చేసిన విశాఖ దుర్ఘటన

అ ర్ధరాత్రి.. గాఢ నిద్రలో జనం.. పరిశ్రమ నుంచి లీకైన గ్యాస్.. ఒక్కసారిగా వ్యాపించిన విషవాయువులు.. శ్వాస తీసుకోలేని పరిస్థితి.. ఏ జరుగుతుందో తెలియని స్థితి.. ఊపిరి తీసుకోవడానికి కిలోమీటర్ల మేర జనం పరుగులు.. చిమ్మ చీకట్లో ఆహాకారాలు.. ఎక్కడ చూసినా ప్రాణభయం.. రోడ్ల వెంట పిట్టల్లా పడిపోయిన జనం.. సాగర నగరం విశాఖపట్నంలో గురువారం (మే 7) వేకువజామున ఎల్‌జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమ తాలూకు విషాద దృశ్యాలివి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన పలువురి పరిస్థితి భయానకంగా ఉంది. గురువారం ఉదయం నిద్ర నుంచి లేస్తూనే ఈ ప్రమాద వార్త గురించి విని తెలుగు ప్రజలు ఉలిక్కిపడ్డారు. సుమారు 36 ఏళ్ల కింద మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన దుర్ఘటనను ఈ ప్రమాదం గుర్తుచేసింది.

1984 డిసెంబరు 2న అర్ధరాత్రి భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమ నుంచి విషవాయువులు వెలవడ్డాయి. ఈ ప్రమాదం వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన పారిశ్రామిక ప్రమాదాల్లో ఇది అత్యంత భయానకమైంది. ఈ ప్రమాదంలో వెలువడిన 40 టన్నుల విషవాయువుల తీవ్రత మూడు రోజుల పాటు కొనసాగింది. ఈ ప్రమాదం సుమారు 10 వేల మందిని పొట్టనపెట్టుకుంది. ప్రమాదంలో మృత్యువాతపడిన ఓ చిన్నారి ఫోటో ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది.

భోపాల్ ప్రమాదం కారణంగా నేటివరకు 25 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారని ఒక అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 లక్షల మంది జీవనంపై ఈ ప్రమాదం పెను ప్రభావం చూపించింది. నేటికీ భోపాల్‌ పరిసర ప్రాంతాల్లో విషవాయు ప్రమాద కుటుంబాల వారసులు జీవచ్ఛవాల్లా బతుకీడుస్తుండటం ఆందోళన కలిగించే విషయం. అణుప్రమాద బాధితుల మాదిరిగా చిన్నారులు, స్త్రీలు, వృద్ధులు రకరకాల వైకల్యాలతో ఇబ్బందులు పడుతున్నారు.

ఈ దుర్ఘటనతో భోపాల్‌ నగరంలో మూడొంతుల భూభాగం విషతుల్యమైపోయింది. గర్భస్థ శిశువులు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యారంటే ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. వారంతా శారీరక, మానసిక వికలాంగులయ్యారు. ఇప్పటికీ అక్కడి భూగర్భంలో విషవాయువుల తాలుకు ఆనవాల్లు అలాగే ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి.

భోపాల్ దుర్ఘటనకు కారణమైన యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ అధినేత, ప్రధాన నిందితుడు వారెన్‌ అండర్సన్‌‌ను 1984 డిసెంబరులో పోలీసులకు పట్టుబడ్డాడు. కానీ, భారత్‌కు తిరిగివస్తానన్న హామీతో అతడు దేశం దాటిపోయాడు. ఇక అంతే.. అతడు తిరిగిరాలేదు. కేంద్ర ప్రభుత్వం రప్పించలేకపోయింది. ఈ కేసు కొనసాగుతుండగానే.. 2014 నవంబర్‌లో 92 ఏళ్ల వయసులో అమెరికాలో వారెన్ అండర్సర్ మృతి చెందాడు.

ఘటన తర్వాత యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ యాజమాన్యం పరిశ్రమను మరో కంపెనీకి అమ్మేసింది. దీంతో బాధితుల తరఫున భారత ప్రభుత్వం, అమెరికా న్యాయస్థానాల్లో పోరాడాల్సి వచ్చింది. అయినా బాధితులకు పెద్దగా నష్టపరిహారం దక్కలేదు. ఒక్కొక్కరికి దక్కిన నష్టపరిహారం రూ.15,000కు మించలేదు. నిందితులకు పెద్దగా శిక్ష పడింది కూడా లేదు. భోపాల్‌ దుర్ఘటన ఒక తరాన్ని కుదిపేసిన విషాదం. అది నేటికీ పీడకలలా వెంటాడుతూనే ఉంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here