రవీంద్రనాథ్ ఠాగూర్.. విశ్వమానవతా వికాసానికి కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి

విశ్వకవి, జాతీయ గీత సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత కోల్‌కతా‌లో 1861 మే 7 జన్మించారు. దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవీల పద్నాలుగో సంతానం. రవీంద్రుని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరవశించవాడు. కథలంటే చెవి కోసుకునే రవీంద్రుడు సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు.

పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడని ఠాగూర్ ఇంటి దగ్గరే విద్యను అభ్యసించారు. ఉదయం గణితం, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషును అభ్యసించేవారు. ఆదివారాలలో సంగీత, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవారు. బెంగాలీతోపాటు ఆంగ్ల భాషల్లోనూ పట్టు సంపాదించిన రవీంద్రుడు కాళిదాసు, షేక్‌స్పియర్ రచనలను ఎక్కువ ఇష్టంగా చదివేవారు. సాహిత్యానికీ, బహుభాషా పాండిత్యానికీ, లలితకళలకూ, ఆధ్యాత్మిక చింతనకీ ఆలవాలమైన ఠాగూర్‌ కుటుంబంలో పుట్టిన రవీంద్రుడు 8 ఏళ్ళ వయస్సులోనే ఒక ఫ్రెంచి కవితకి అనువాదం చేశాడు.

ఉన్నత విద్య కోసం ఇంగ్లాండుకు వెళ్లిన రవీంద్రుడు ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై మరింత అభిరుచి పెంచుకున్నారు. సాహితీవేత్తల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలు, సంగీత కచేరీలకు హాజరై ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలను ఆకళింప జేసుకున్నారు. అక్కడ తన అనుభవాలను స్నేహితుడు భారతికి లేఖలుగా రాసేవాడు. ఇంగ్లండులో ఉండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని విశ్వకవి రచించాడు. విర్గరేర్ స్వప్న బంగ, సంగీత ప్రభాత అనే భక్తి గీతాలను కూడా రాశారు.

రవీంద్రుని రచనల్లో గీతాంజలి గొప్పది. బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను గీతాంజలి పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. అనంతరం దీన్ని అనేక ప్రపంచ భాషలలోకి తర్జుమా చేశారు. ప్రపంచ సాహిత్యంలో ఇది ఓ గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలు, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ గొప్పదనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. ఈ రచనకే 1913 సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. అంతేకాదు నోబెల్ పొందిన తొలి భారతీయుడిగానే కాదు ఆసియాలోనే తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.

రవీంద్రుడు కేవలం రచయితగానే కాదు, చిన్నారుల హృదయాలను వికసింపజేసే ప్రాచీన గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఐదుగురు విద్యార్థులతో ఆరంభించిన విశ్వభారతి క్రమంగా విస్తరించింది. ఉపాధ్యాయుల ఇళ్లలో విద్యార్థులు భోజనం చేసేవారు. ప్రాతఃకాలంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రంచేసి స్నానం చేయడం, ప్రార్థనలు చేయడం, నియమిత వేళలలో నిద్ర పోవడం వారి దినచర్య. ఆరోగ్యం, పరిశుభ్రత, వాక్కు శుద్ధి, పెద్దలను, గురువులను గౌరవించడం ఇక్కడ నేర్పేవారు. 1919లో కళా‌భవన్‌ను స్థాపించి విద్యార్థులకు విభిన్న కళలను నేర్పించేవారు.

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని భావించిన రవీంద్రుడు శ్రీనికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. మొదట వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించిన విశ్వకవి, తరువాత అనేక నాటకాలు రాశారు. రవీంద్రుడి కలం నుంచి జాలువారిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచిపేరు తెచ్చింది. ప్రకృతి – ప్రతీక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించారు. కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక నాటకాలను విశ్వకరి రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలనే సాంఘిక ప్రయోజనం, సందేశ మిళితమైన ‘గోరా’ నవల రవీంద్రుని కీర్తిని మరింత ఇనుమడింపజేసింది.

రవీంద్రుడి ముందు నుంచి జాతీయభావం ఎక్కువ. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడుతూ జాతీభావాలను ప్రచారం చేశారు. పృథ్వీరాజ్ పరాజయం గురించి ప్రబోధాత్మక పద్య నాటకాన్ని రచించాడు. బాల గంగాధర్ తిలక్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, జాతీయ నిధికి విరాళాలు సేకరించారు. ఇక,1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని గీతాన్ని తొలిసారి ఆలపించాడు.

రవీంద్రుడు రాసిన జనగణమణను జాతీయ గీతంగా ప్రకటించే ముందు ‘వందేమాతరం’, ‘జనగణమన’లపై దేనిని ప్రకటించాలని సుధీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి ‘జనగణమన’ దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయగీతంగా, వందేమాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here