భారత్‌లో రెండోసారి కరోనా విజృంభణ.. ఐఐఎస్సీ, టిఫర్ స్టడీలో సంచలన విషయాలు

దేశంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కొన్ని వారాల పాటు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినా.. మళ్లీ వర్షాకాలంలో రెండోసారి మహమ్మారి విజృంభించి అవకాశం ఉందని ఓ అధ్యయనం హెచ్చరించింది. జులై చివరి వారం లేదా ఆగస్టులో కేసుల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ్‌మెంటల్ రిసెర్చ్, శివనాడార్ యూనివర్సిటీ సంయుక్తంగా జరిపిన అధ్యయనం పేర్కొంది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత ప్రజలు ఏ మేరకు భౌతికదూరం పాటిస్తారనే అంశంపైనే వైరస్ తీవ్రత ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది.

రోజువారీ కొత్త కేసుల నమోదు ఓ దశకు చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని, చివరికి కొన్ని వారాలు లేదా నెలల తర్వాత దిగువకు పడిపోతుందని అధ్యయనంలో పాల్గొన్న శివనాడార్ యూనివర్సిటీకి గణిత విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సమిత్ భట్టాచార్య అన్నారు. అయినప్పటికా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటాన్ని రెండో దశగా భావించాలని ఆయన వివరించారు. ఈ అధ్యయనం అంచనాలతో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్ రాజేశ్ సుందరేశన్ ఏకీభవించారు. ఒక్కసారి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మరోసారి వైరస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని, చైనాలో ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఇదే జరుగుతోందని అన్నారు.

మార్చి 25 నాటికి దేశంలో పాజిటివ్ కేసులు 613 నమోదు కాగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. తర్వాత దీనిని మే 3 వరకు పొడిగించింది. ఈ 31 రోజుల్లోనే మొత్తం కరోనా కేసులు 23 వేలు దాటగా.. 718 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో కేసుల పెరుగుదల రేటు తగ్గడం శుభపరిణామం. లాక్‌డౌన్‌కు ముందు కేసులు రెట్టింపు కావడానికి 3.4 రోజులు పడితే ప్రస్తుతం 7.5 రోజులు పడుతోంది. అలాగే గడిచిన 10 రోజులుగా కోలుకున్న బాధితుల రేటు కూడా రెట్టింపయ్యింది.

గత కొన్ని రోజులుగా కొత్త కేసుల పెరుగుదల రేటు అంతకు ముందుతో పోల్చితే నెమ్మదించింది… వృద్ధి రేఖ పీఠభూమి దశకు చేరుకున్నట్లు స్పష్టంగా సూచిస్తుందని భట్టాచార్య అన్నారు. చైనా, ఐరోపాలో కోలుకున్న బాధితుల్లో తిరిగి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఇటీవల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. కాబట్టి, గతంలో వైరస్ బారిపడ్డవారిలో రోగనిరోధక వ్యవస్థ పెరుగుతున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని, ఆవిధంగా రెండోసారి వైరస్ ప్రభావానికి గురవుతారని పేర్కొన్నారు.

ఐసోలేషన్, హోమ్ క్యారంటైన్, సామాజిక దూరం, లాక్‌డౌన్ ఆంక్షలు తదితర అంశాల ఆధారంగా ఐఐఎస్సీ, టిఫర్ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. బెంగళూరు ముంబైలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం వైరస్ రెండోసారి వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. వైరస్‌ను గుర్తించడం, స్థానికీకరించడం, ఐసోలేషన్ చేయడం, కొత్త ఇన్ఫెక్షన్ల నిరోధించడానికి చర్యలు తీసుకోకపోతే ప్రజారోగ్య ముప్పు పొంచి ఉంటుందని సూచిస్తుంది. ఆంక్షలు సడలించే సమయంలో ప్రతి నగరంలో సంక్రమణ వ్యాప్తి స్థాయిలపై కొత్త స్థాయిలు, ఆరోగ్య సంరక్షణ డిమాండ్ గరిష్ట స్థాయిలను బట్టి ఉంటుందని వారు తెలిపారు.

ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతోందని, ఇది మనకు అత్యంత విలువైన సమయం… టెస్టింగ్, ట్రేసింగ్, క్వారంటైన్, ఐసోలేషన్, పరిశుభ్రత పాటించడం, వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు చేయాలి.. లాక్‌డౌన్‌ నిబంధనలు ఎలా సడలించడం చాలా కష్టమైన పని అని సుందరేశన్ అన్నారు. ఇది దశలవారీగా జరుగుతుందని స్పష్టమవుతోంది… ప్రజారోగ్య ప్రభావాన్ని అంచనా వేయడానికి సహాయపడే సాధనాలతో ముందుకు రావడం లాంటి విషయాలపై మా బృందం దృష్టి సారించిందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here