పింఛను లాక్కొని కోడలి హింస.. రిజర్వాయర్‌లో దూకిన 90 ఏళ్ల అత్త

90 సంవత్సరాల వయసున్న ఓ వృద్ధురాలు మానేర్‌ డ్యాంలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. అక్కడే ఉన్న లేక్‌ పోలీసులు ఆమె దూకడం గమనించి, కాపాడి కుమారుడికి అప్పగించారు. కుటుంబంలో తగాదాలు భరించలేక ఈ వయసులో వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

వృద్ధురాలిని కాపాడిన తర్వాత పీఎస్‌కు తీసుకొచ్చి పోలీసులు విచారణ జరిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నరికుల్ల లచ్చవ్వ అనే వృద్ధురాలు ఉంటోంది. ఇంట్లో కోడలు పెడుతున్న బాధలు భరించలేక పోతోంది. దీంతో ఈ వయసులో చేసుకోవాలని నిర్ణయించుకుంది. మానేరు డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకొని.. వేములవాడ నుంచి మానేరు డ్యాం వరకు నడుచుకొంటూ వచ్చింది. అక్కడ రెయిలింగ్ నుంచి నీటిలో దూకేసింది.

ఆమె దూకడాన్ని అక్కడే కొంచెం దూరంలో ఉన్న లేక్‌ పోలీసులు గమనించారు. వెంటనే వారు ఆమెను రక్షించి బయటకు లాగారు. అనంతరం ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తన భర్త మరణంతో కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం కొడుకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో పనిచేస్తున్నాడని వివరించింది. తన భర్త చనిపోయిన నాటి నుంచి తనకు నెల నెలా రూ.10 వేల పెన్షన్‌ వస్తుందని వెల్లడించింది. ఆ పింఛనును కోడలు లాగేసుకొని తనను ఎప్పుడు బాధపెడుతూ ఉంటుందని పోలీసులతో చెప్పింది.

తర్వాత పోలీసులు ఆమె కుమారుడిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిని అప్పగించారు. మరోసారి, ఇంట్లో ఇలాంటి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here