కరోనా ఫ్రీ స్టేట్ గోవాలో కలకలం.. కొత్తగా ఏడుగురికి పాజిటివ్

దేశంలోనే తొలి కరోనా రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిన గోవాలో మరోసారి వైరస్ కలకలం రేగింది. కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొంది, గ్రీన్ జోన్‌లోకి ఇటీవలే చేరిన‌ గోవాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ర్యాపిడ్ టెస్టుల‌ు నిర్వహించగా.. ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా ముంబై నుంచి వచ్చినవారు కాగా.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచినట్టు ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు.

చివరిసారిగా గోవాలో ఏప్రిల్ 3న పాజిటివ్ కేసు నమోదు కాగా మే 1న గోవాను కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం ఏడుగురు కేసులు నమోదు కాగా… చివరి రోగి ఏప్రిల్ 19 కోలుకుని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు తిరిగి పాజిటివ్ కేసులు వెలుగు చూడ‌టం గోవాలో క‌ల‌క‌లం రేపుతోంది.

తాజాగా, వైరస్ నిర్ధారణ అయిన ఏడుగురిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. భార్య,భర్త వారి ముగ్గురు పిల్లలకు వైరస్ సోకినట్టు ఆరోగ్య మంత్రి వెల్లడించారు. వీరంతా మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి వచ్చినట్టు వివరించారు. వీరు ఉత్తర గోవాలోని క్యారంటైన్ కేంద్రంలో ఉన్నట్టు తెలిపారు. మిగతా ఇద్దరూ లారీ డ్రైవర్లు కాగా… ఒకరు గుజరాత్ నుంచి, ఇంకొకరు ముంబయి నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. ట్రూనాట్ యంత్రాలతో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి బుధవారం సాయంత్రం తరలించారు. ఇప్పటి వరకూ మొత్తం 6,151 మందికి పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

పొరుగున ఉన్న కర్ణాటకలోని బెలగావీ ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో సరిహద్దులును మూసివేసి, రాష్ట్రంలోకి వచ్చినవారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. బెలగావీ నుంచే గోవాకు కూరగాయలు, పండ్లు పెద్ద సంఖ్యలో వస్తాయి. అందుకే గోవాకు బెలగావీ కీలకం కావడంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here