కరోనాకు యాంటీబాడీస్ చికిత్స.. భారత్ బయోటెక్ శ్రీకారం

ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు క్లినికల్ ట్రయల్స్ కూడా ఆరంభించాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ‘హ్యూమన్‌- మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌’ చికిత్సను అభివృద్ధిని వేగవంతం చేసింది. న్యూ మిలీనియమ్‌ ఇండియన్‌ టెక్నాలజీ లీడర్‌షిప్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమం కింద భారత్‌ బయోటెక్‌కు ఈ ప్రాజెక్టును సీఎస్‌ఐఆర్‌ మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో భారత్‌ బయోటెక్‌‌తో పాటు పుణెలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్సెస్‌, ఐఐటీ- ఇండోర్‌, గురుగ్రామ్‌కు చెందిన ప్రిడోమిక్స్‌ టెక్నాలజీస్‌ భాగస్వాములుగా ఉన్నాయి.

కరోనా వ్యాధికి ఔషధాలు, వ్యాక్సిన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నా.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను అన్వేషించడం తప్పనిసరని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా హ్యూమన్‌- మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్సను అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు ఆ సంస్థ పేర్కొంది. తాము రూపకల్పన చేస్తున్న చికిత్సా విధానం కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేయడంతో పాటు వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ తరహా చికిత్స సత్ఫలితాలు ఇస్తుందని సంస్థ పేర్కొంది.

వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అది కోవిడ్‌-19 రాకుండా అదుపు చేస్తుంది.. కానీ వ్యాధి బారినపడ్డవారికి వైద్యం చేసే అవకాశం ఉండాలని, ఇందుకు మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్స సరైన పరిష్కారం అవుతుందని ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల వ్యాఖ్యానించారు. భారత్‌లో అధిక రక్తపోటు, మధుమేహ, గుండె జబ్బుల బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వయసుపైబడి, ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నవారికి కరోనా సోకితే, చికిత్స చేయడం కష్టమన్నారు. కాబట్టి, కొత్తరకం చికిత్సా విధానాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు కరోనాను అదుపు చేసే యాంటీబాడీలను కనుగొన్నట్లు ఇటీవల ప్రకటించారని, తాము కూడా కోవిడ్-19ను నాశనం చేసే వివిధ రకాల యాంటీ బాడీల మిశ్రమాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడు తన జన్యురూపాన్ని మార్చుకుంటున్నప్పటికీ దాన్ని కట్టడి చేయడమే తమ లక్ష్యమని కృష్ణ ఎల్ల ఉద్ఘాటించారు. యాంటీ బాడీస్‌ చికిత్సను రాబోయే 6 నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలనేది తమ ప్రయత్నమని, దీంతో కరోనా వైరస్‌ వ్యాధికి ఒక కొత్త చికిత్స అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, అమెరికా పరిశోధకులతో కలిసి నాసిల్ వాక్సిన్ కోరో‌ఫ్లూ‌ను అభివృద్ధి చేస్తోంది. మాడిసన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్ పరిశోధకులతో కలిసి తాము రూపకల్పన చేస్తున్న వ్యాక్సిన్ మరో ఏడాది నుంచి ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుందని సీఎండీ తెలిపారు. తమ సంస్థ 10 రకాల వైరల్ వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here