ఐరాస చెప్పినా పాక్ తీరు మారలేదు.. పదే పదే కాల్పుల ఉల్లంఘన

సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం పదే పదే కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించింది. కరోనా వైరస్ మహమ్మారి ఎల్ఓ‌‌సీ సహా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందని, ఇలాంటి సమయంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి భారతీయులను పొట్టనబెట్టుకుంటోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అధికార ప్రతినిధి అన్నారు.

గురువారం పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు జరిపిన కాల్పులకు పాల్పడిన ఒకర్ని బలితీసుకోవడంపై భారత్ శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ప్రపంచం కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని, ఇలాంటి సమయంలో కాల్పుల విరమణ పాటించాలని సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి చేశారు.. ఇది ప్రతి చోటా వర్తిస్తుందని యుఎన్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ అన్నారు. కాల్పుల విరమణపై ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రకటన చేసినా.. పాకిస్థాన్ సైన్యం పదే పదే ఉల్లంఘిస్తోందని అడిగిన ప్రశ్నకు స్టెఫాన్ పై విధంగా స్పందించారు.

పూంచ్ జిల్లాలోని ఖస్బా, కెయిర్న్, షపూర్, మన్‌కోటే సెక్టార్‌లలో పాకిస్థాన్ సైతం బుధ, గురువారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దుచేసిన తర్వాత పాక్ నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఉగ్రవాదులను దేశంలోకి చేరవేసేందుకు ప్రయత్నిస్తోంది.

మరోవైపు, భారత్ జరిపిన కాల్పుల్లో తమ సైనికుడు, మరో ఇద్దరు మహిళలు చనిపోయారని పాకిస్థాన్ గురువారం ఆరోపించింది. భారత్, పాక్‌లోని ఐరాస మిలటరీ అబ్జర్వేషన్ గ్రూప్‌ (యూఎన్ఎంజీఐపీ) నుంచి దీనిపై ఎలాంటి సమాచారం తమకు లేదని డుజారిక్ అన్నారు. యూఎన్ఎంఓజీఐపీని 1949లో ఏర్పాటుచేయగా.. ఇది ఎల్‌ఓసీ వెంబడి కాల్పులు ఉల్లంఘన గురించి పర్యవేక్షించి నివేదికను అందజేస్తుంది. ఏదేమైనా, 1972లో ఇరు దేశాల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందం తరువాత యూఎన్ఎంజీఐపీ ప్రాధాన్యత తగ్గిపోయిందని భారతదేశం పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here