ఇక విమానం ఎక్కాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే!

లా క్‌డౌన్‌తో స్తంభించిపోయిన రవాణా సౌకర్యాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే రైలు సేవలను పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా విమాన సేవలను ప్రారంభించడానికి కసరత్తు చేస్తోంది. పౌర విమానయాన సంస్థ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో డ్రాఫ్ట్‌ను రూపొందించినట్లు సమాచారం. మే 17తో లాక్‌డౌన్ 3.0 ముగుస్తుండటంతో మే 18 నుంచి విమానాల కమర్షియల్ సేవలు పునరుద్ధరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ తర్వాత కొన్ని పరిమితులతో విమాన ప్రయాణికులను అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. క్యాబిన్‌ లగేజ్‌ బ్యాగ్ తీసుకురాద్దు, ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, నిర్ణీత సమయానికి 2 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి.. విమాన సేవలను పునరద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం విధించనున్న నిబంధనలివి. విమాన ప్రయాణ నిర్వహణ విధివిధానాలకు సంబంధించి పౌర విమానయాన శాఖ ప్రయాణీకులకు ఇలాంటి సూచనలు చేయనుంది. సోమవారం (మే 12) జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముసాయిదాలోని నిబంధనలు..

* 80 ఏళ్ల వయసు దాటిన ఏ ప్రయాణికుడినీ విమానాల్లోకి అనుమతించరు.

* శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే అలాంటి ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి. అలాంటి వారు తమ ప్రయాణ తేదీని ఎలాంటి జరిమానా లేకుండా మార్చుకోవచ్చు. అందుకు సంబంధించిన వివరాలను ఆయా ఎయిర్‌లైన్స్‌ తమ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతాయి.

* ప్రయాణికులు ఎలాంటి లగేజ్‌ను తీసుకురాకూడదు. ప్రయాణికుడితో 20 కేజీలకు మించని ఒక్క బ్యాగ్‌ మాత్రమే అనమతిస్తారు.

* కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో మధ్యలో ఉండే సీట్లలో ఏ ప్రయాణికుడు కూర్చోకూడదు. అవి ఖాళీగానే ఉంటాయి.

* ప్రయాణికుడు తన క్వారంటైన్‌ వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. గత నెల రోజుల్లో కరోనా వ్యాధి బారిన పడ్డారా? అందుకు సంబంధించి ఏమైనా చికిత్స తీసుకున్నారా? తదితర వివరాలను తెలపాల్సి ఉంటుంది.

* అలా ఎవరైనా క్వారంటైన్‌లో ఉంటే ఎయిర్‌పోర్ట్‌లో ఉండే ఐసోలేటెడ్ సెక్యురిటీ చెకింగ్‌ యూనిట్‌ను సంప్రదించాలి.

* విమాన ప్రయాణికుల మొబైళ్లలో ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా ఉండాలి.

* ప్రయాణికులు రెండు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి. అంతకంటే ముందు వచ్చే వారిని లోపలికి అనుమతించరు.

* ప్రయాణ సమయానికి గంట ముందు మాత్రమే బోర్డింగ్‌కు అనుమతిస్తారు. 20 నిమిషాల ముందే గేట్లను మూసేస్తారు.

* ప్రయాణికులు నిర్దేశిత ట్యాక్సీలను మాత్రమే వినియోగించి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

* ప్రయాణ సమయంలో ఎలాంటి ఆహారాన్ని అందించరు. నిర్దేశిత ప్రాంతంలో, అక్కడ అందుబాటులో ఉంచిన కప్పులతో మాత్రమే మంచినీరు తాగాలి.

* విమాన సిబ్బంది (పైలెట్లు, క్యాబిన్‌ అటెండర్లు)ని పదే పదే మార్చకూడదనే నిబంధన విధించనున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లలో కూడా సామాజిక దూరం పాటించడానికి పలు చర్యలు చేపట్టనున్నారు. ప్రయాణికులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల తనిఖీ విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. టెర్మినల్‌ గేట్‌ వద్ద జన సందోహాన్ని తగ్గించేందుకు తనిఖీలను రద్దు చేయనున్నారు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, కుర్చీలు, ఇతర సీటింగ్‌ ప్రాంతాలు, ఆహార పదార్థాలు విక్రయించే స్టాళ్లు తదితర ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించేలా అవసరమైన గుర్తులు పెట్టడం లాంటి చర్యలు చేపడతారు. ఆయా ప్రాంతాల్లో ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లతో ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తారు.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల నుంచి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి కోసం విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా మార్చి 25 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తూ విమానయాన శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here