ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టే వ్యాధులంటే మనం చాలా వరకూ.. గుండెపోటు, క్యాన్సర్ వంటి పెద్దపెద్ద సమస్యలనే వూహించుకుంటాం. కానీ నేటి కంప్యూటర్ యుగం.. ‘కనిపించని’ మరెన్నో ముప్పులు తెచ్చిపెడుతోంది.
ప్రజల దృష్టి సమస్యల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? కాలంతో పాటే వీటిలో కూడా ఏవైనా మార్పులు వస్తున్నాయా? అన్నది గుర్తించేందుకు ఇటీవలే ఓ భారీ అధ్యయన నిర్వహించారు అమెరికా పరిశోధకులు.
ఆశ్చర్యకరంగా- ఇప్పుడు 12-54 ఏళ్ల మధ్య వయసు వారిలో హ్రస్వదృష్టి (మయోపియా) సమస్య ఒకప్పటి కంటే చాలా ఎక్కువగా ఉంటోందని వెల్లడైంది. ఈ హ్రస్వదృష్టి సమస్య ఉన్న వారికి దగ్గరి వస్తువులు బాగానే కనబడతాయిగానీ దూరంగా ఉన్నవేవీ సరిగా కనబడవు. అమెరికాలో 1972లో దాదాపు 25% మందికి ఈ సమస్య ఉండగా.. అదే 2004 నాటికి వచ్చేసరికి ఇది 42 శాతానికి పెరిగిందని అమెరికా జాతీయ నేత్ర సంస్థ గుర్తించింది. నేటి యువతరం ఆరుబయట గడిపే సమయం తగ్గిపోతోంది. ఎక్కువగా గదుల్లోనే ఉండటం, రోజంతా కంప్యూటర్లు, వీడియోగేమ్ల వంటి దగ్గరి దగ్గరి వస్తువులనే తదేకంగా చూడటానికి అలవాటుపడుతుండటం వల్లే ఈ హ్రస్వదృష్టి సమస్య పెరిగి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.