IAF: కరోనా వీరులారా వందనం.. రోమాలు నిక్కబొడిచే వీడియో

లా క్‌డౌన్‌తో పెళ్లిళ్లు, శుభకార్యాలు లేక పూలన్నీ అలిగాయి. రైతులు వాటిని కోయకుండా అలాగే వదిలేయడంతో.. కనీసం దేవుడి పూజకు కూడా నోచుకోలేకపోతున్నామే అని కన్నీళ్లు పెట్టుకున్నాయి. దేవుడు వాటి మొర విన్నట్టున్నాడు. చివరికి కరోనా మహమ్మారితో అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికుల పాదాల చెంతకు చేరి ఆ విరులన్నీ వికసించాయి. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి పోరాడుతున్న కనిపించే దేవుళ్లకు ఆనందంగా తమను తాము సమర్పించుకున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్-19 ఆస్పత్రుల వద్ద ఆదివారం (మే 3) భావోద్వేగ వాతావరణం నెలకొంది.

కరోనా మహమ్మారితో అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధులకు భారత సైన్యం ఘనంగా జేజేలు పలికింది. వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు కరోనా వారియర్స్‌పై పూలవర్షం కురిపించాయి. దేశంలోని వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు తమ జీవితంలో ఎన్నడూ పొందని గౌరవాన్ని అందుకొని మురిసిపోగా.. ఆ అపురూప దృశ్యాలను అశేష భారతావని టీవీ తెరలపై వీక్షిస్తూ భావోద్వేగానికి గురైంది. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు మార్మోగాయి.

ఢిల్లీలోని వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధవిమానాలు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. గగనతలంలో వీనులవిందు చేశాయి. ఆ దృశ్యాల సమాహారాన్ని వీడియోలో వీక్షించండి..

కరోనా వారియర్స్‌కు అటు ఇండియన్ కోస్ట్‌గార్డ్, ఇండియన్ నేవీ కూడా సంఘీభావం ప్రకటించింది. యుద్ధనౌకలను విద్యుద్దీపాలతో అలంకరించి తీర ప్రాంతాల్లో మోహరించింది. ఆదివారం (మే 3) రాత్రి 7 గంటల తర్వాత విశాఖపట్నం, చెన్నై, ముంబై, తిరువనంతపురం తదితర తీర ప్రాంతాల్లో ఈ యుద్ధనౌకలు కాంతులీనుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వైరస్ కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్న కరోనా వారియర్స్‌కి నౌకాదళ సిబ్బంది గౌరవవందనం సమర్పించింది. ‘Thank You’ అంటూ మానవహారం ఏర్పాటు చేసి జేజేలు పలికింది. దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణకు డాక్టర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కృషి చేస్తున్నారు. లాక్‌డౌన్ విధుల్లో పోలీసు సిబ్బంది కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరందరికీ భారత త్రివిధ దళాలు కృతజ్ఞతలు తెలిపాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here