మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్ క్లీన్ చేయించారు. దీంతో స్కూలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లిన పిల్లలు… తాము అన్నం తినే ప్లేట్లతో టాయిలెట్ లోని మలాన్ని ఎత్తించారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా టీచర్లను నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా, అప్పటికే వారంతా స్కూలు నుంచి వెళ్లిపోయినట్టు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు.
దీంతో వారంతా నిన్న స్కూలులో ఆందోళన చేపట్టారు. అయితే పిల్లల తల్లిదండ్రుల ఆరోపణలను ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారని చెప్పారు. పాఠశాలలో ఒకే టాయిలెట్ ఉందని, అలాంటప్పుడు విద్యార్థులతో ఎందుకు క్లీన్ చేయిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై వార్తలు వెలువడడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.