హ్యాట్సాప్.. కరోనా రోగి ప్రాణాలు నిలబెట్టడానికి రిస్క్ చేసిన ఎయిమ్స్ డాక్టర్

బారినపడి పరిస్థితి విషమించిన బాధితుడి రక్షించే క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌ సీనియర్‌ రెసిడెంట్ డాక్టర్ పెద్ద సాహసమే చేశారు. రోగిని కాపాడే క్రమంలో తన వ్యక్తిగత భద్రతను పక్కనబెట్టారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు వైద్యుడు పీపీఈ కిట్‌లను తీసేసి, వైద్యం చేయడంతో ఆయనను క్వారంటైన్‌కు పంపారు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన డాక్టర్ జహీద్ అబ్దుల్ అహ్మద్.. ఎయిమ్స్ సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. కరోనా వైరస్ బాధితుడిని అంబులెన్స్‌లో ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌లోని ఐసీయూకు తరలించే బాధ్యతను శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ఆయనకు అప్పగించారు.

అయితే శ్వాస తీసుకోవడంలో ఆ రోగి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన డాక్టర్ మజీద్‌.. ఆక్సిజన్ కోసం గొంతులో అమర్చిన గొట్టం పొరపాటున ఊడిపోయినట్లు గమనించారు. దాన్ని తిరిగి అమర్చేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే అంబులెన్స్‌ లోపల వెలుగు సరిగా లేకపోవడం సహా తన వ్యక్తిగత రక్షణ కవచాలు, కళ్లజోడు ధరించి ఉండటంతో సరిగా కనిపించలేదని మజీద్‌ చెప్పారు. ఆలస్యం చేస్తే రోగి చనిపోయే ప్రమాదం ఉన్నందున అతడిని రక్షించడానికి కళ్లద్దాలు, ముఖానికి ఉండే కవచాన్ని తొలగించి, ట్యూబ్‌ను అమర్చినట్లు తెలిపారు.

ఈ క్రమంలో బాధితుడి నుంచి భారీగా వైరస్‌ అంటుకునే ప్రమాదం ఉన్నప్పటికీ ఆయన ఏ మాత్రం వెనుకాడలేదని ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతోందని, దీనిపై అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. రోగులు, సాటి ఉద్యోగులు, వైద్య సిబ్బంది పట్ల సానుభూతి చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వృత్తిపట్ల డాక్టర్ జాహిద్ అబ్దుల్ మజీద్‌‌ చూపిన అంకితభావాన్ని ఎయిమ్స్ రెసిడెంట్‌ డాక్టర్స్ అసోసియేషన్ అభినందించింది. దేశవ్యాప్తంగా వైద్యుల సేవలు ఆదర్శవంతమైనవని కొనియాడింది. సీనియర్ వైద్యులు వారి పనితీరును మెచ్చుకుని, ధైర్యాన్ని నింపాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here