లాక్‌డౌన్ ఎఫెక్ట్: 50 శాతం తక్కువ తింటున్న గ్రామీణ ప్రజలు.. సర్వేలో ఆసక్తికర ఫలితాలు

దేశంలో కట్టడికి విధించిన ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మేరకు ఉందనే అంశాన్ని తెలుసుకోడానికి ప్రముఖ పౌర సమాజ సంస్థలు సర్వే నిర్వహించాయి. మొత్తం 12 రాష్ట్రాల్లోని 5,000కిపైగా గ్రామీణ కుటుంబాలలో అధ్యయనం నిర్వహించగా.. వీరిలో సగం మంది సంక్షోభాన్ని అధిగమించడానికి గతంలో తీసుకున్న దాంట్లో సగం ఆహారం, మరికొందరు తక్కువ సార్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు. తాము తీసుకునే ఆహారంలో పదార్థాలను తగ్గించినట్టు సర్వేలో పాల్గొన్న 68 శాతం మంది చెప్పారు. అలాగే, గతంలో మాదిరిగా కాకుండా తక్కువసార్లు తింటున్నామని మరో 50 శాతం మంది తెలిపారు. ఇక, ఆహార పదార్థాలను అప్పు తెచ్చుకుంటున్నామని మరో 24 శాతం మంది పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని 84 శాతం మంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలు పొందుతున్నట్టు వివరించారు. అయితే, 1/6 వంతు ప్రజలకు మాత్రం ఇంకా రేషన్ అందడంలేదని తేలింది. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో పీడీఎస్,పెట్టుబడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలనే అంశాన్ని ఈ అధ్యయనం నొక్కివక్కాణించింది. ఎందుకంటే ఇవి రాబోయే నెలల్లో చాలా మందికి జీవనాధారంగా ఉంటాయి.

‘కోవిడ్-19 ప్రేరేపిత లాక్‌డౌన్.. గ్రామీణ జీవితాలపై ప్రభావం’ పేరుతో ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు ఈ అధ్యయనం నిర్వహించారు. మొత్తం 12 రాష్ట్రాల్లో 47 జిల్లాల్లోని 5,162 గ్రామీణ కుటుంబాలను కలిసి, వారి అభిప్రాయాలను సేకరించారు. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, అసోం, కర్ణాటకలో ఈ సర్వే చేపట్టారు.

ప్రధాన్, యాక్షన్ ఫర్ సోషల్ అడ్వాన్స్‌మెంట్, బైఫ్, ట్రాన్స్‌ఫామ్ రూరల్ ఇండియా ఫౌండేషన్, గ్రామీణ సహరా, సాథీ-యూపీ, అగాఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్, వికాస్ అవేష్ ఫౌండేషన్, సంబోధి సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి.

సర్వే చేసిన మూడింట ఒక వంతు గృహాలలో క్షీణిస్తున్న నిత్యావసరాలు నిల్వల గురించి హెచ్చరిచ్చింది. ఖరీఫ్ పంట మిగులు మే చివరి వరకు మాత్రమే ఉంటుందని మూడింట ఒక వంతు మంది చెప్పారు. అలాగే, ఖరీఫ్‌ సీజన్‌కి విత్తనాలు అందుబాటులో లేవని మూడింట ఒక వంతు పేర్కోగా.. సగం మంది పంట రుణాలు కోసం ఎదురుచూస్తున్నారు. అందువల్ల, ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వ మద్దతుపై దృష్టి పెట్టాలని, ఇందులో విత్తనాలు, రుణాలు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధ్యయనం తెలిపింది.

లాక్‌డౌన్ వల్ల ఆదాయం కోల్పోవడంతో దాదాపు 22 శాతం కుటుంబాలు రుణాలు చేస్తున్నారని తేలింది. అలాగే మరో 22 శాతం మంది పశువుల అమ్మకం ద్వారా, మరో 14 శాతం మంది వస్తువులు తాకట్టు పెట్టడం ద్వారా డబ్బులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల విద్యావకాశాలపై కూడా కోవిడ్-19 ప్రభావం చూపుతున్నట్టు సర్వే హెచ్చరించింది. అత్యవసరం కాని ఖర్చుల వాయిదా గురించి అడిగినప్పుడు, దాదాపు 29% గృహాలు తమ పిల్లలను పాఠశాల మాన్పించడానికి సిద్ధంగాలేరని తేలింది.

సర్వేలో పాల్గొన్న కుటుంబాల్లో 17% మంది వలస కూలీలు ఉన్నారు. మహిళలకు అదనపు పని భారం కూడా ఉందని సర్వేలో తేలింది. దాదాపు 62% గృహాలలోని మహిళలు తాగు నీరు తీసుకురావడానికి ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నట్లు నివేదించింది. 68% గృహాలలో మహిళలు వంట కలపను సేకరించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here