లాక్‌డౌన్ ఎత్తివేశాక.. ఇష్టమైనా సరే ఈ పనులు చేయొద్దు

మే 3వ తేదీతో దేశవ్యాప్తంగా విధించిన గడువు ముగియనుంది. ఇప్పటికే లాక్‌డౌన్ విధించి 40 రోజులు కావొస్తున్న నేపథ్యంలో మే 4 నుంచి గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తామనే సంకేతాలను కేంద్రం ఇప్పటికే పంపింది. వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లడానికి మోదీ సర్కారు అనుమతి ఇచ్చింది. జనం కూడా ఎప్పుడెప్పుడు ఇళ్ల నుంచి బయటకు వెళ్తామా అని ఎదురు చూస్తున్నారు. చాలా రోజులపాటు నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలను గ్రీన్ జోన్లలో ఇక నుంచైనా ప్రారంభించాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా ఇప్పటికిప్పుడే మాయం కాదు కాబట్టి.. మన జాగ్రత్తలో మనం ఉండాలి. లాక్‌డౌన్‌ను ఎత్తివేయగానే ఏం చేయొద్దో ఇప్పుడు చూద్దాం..

సోషల్ డిస్టెన్సింగ్‌ నిబంధనలను పాటించకపోవడం:

లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత కూడా భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి. సోషల్ డిస్టెన్సింగ్ వల్ల గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ముప్పు తగ్గుతుంది. కరోనా బారిన పడిన ఎదుటి వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు ఎవరి మీదైనా పడితే.. వారికి కూడా కోవిడ్ సోకుతుందనే సంగతి తెలిసిందే. కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనను చాలా కాలం పాటించాలి.

అనారోగ్యకరమైన ఆహారం తినడం:

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, మంచి ఆహారం తీసుకోవడం ఎప్పుడూ ముఖ్యమే. కరోనా వైరస్ లాంటి మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. యాంటీ ఆక్సిడెంట్లను తగిన మోతాదులో తీసుకుంటూ.. అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్‌కు దూరంగా ఉండాలి. బయటి ఆహారం తినడానికి బదులు ఇంట్లోనే వండుకొని తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం:

చేతులను తరచుగా సబ్బు, నీళ్లతో కడుక్కోవాలి. కనీసం 20 సెకన్లపాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. బయటకెళ్లి వచ్చినప్పుడు, దేన్నయినా తాకినప్పుడు, భోజనానికి ముందు, దగ్గినప్పుడు టిష్యూ వాడిన సందర్భంలో చేతులను కడుక్కోవడం మర్చిపోవద్దు. చేతులను కడుక్కోలేకపోతే.. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్లను ఉపయోగించాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు నోటికి కర్చీఫ్ లేదా న్యాప్‌కిన్ అడ్డుపెట్టుకోవాలి.

వ్యాక్సినేషన్ తీసుకోవడం:

లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వ్యాక్సినేషన్ తీసుకోవడం సరికాదు. ఇప్పటికే అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసి ఉన్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రజలు వెళ్లడం వల్లే కరోనా వ్యాప్తి చెందింది. కాబట్టి ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళ్లొద్దు.

పార్టీలు చేసుకోవడం, షాపింగ్‌లకెళ్లడం:

కొంత మందికి పార్టీలు చేసుకోవడమంటే చాలా ఇష్టం. కానీ జన సమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది. పార్టీల కోసం క్లబ్‌లు, బార్లు, షాపింగ్ మాల్స్‌కు వెళ్లడం వల్ల సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించడం సాధ్యం కాదు. ఇన్ఫెక్షన్ బారిన పడే ముప్పు కూడా ఎక్కువ అవుతుంది.

మాస్కులను పడేయొద్దు:

కరోనాను కట్టడి చేయడం కోసం ఇప్పుడు బయటకు వెళ్తున్న ప్రతి ఒక్కరూ మాస్కులను ధరిస్తున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా మాస్క్‌లను ధరించాలి. ఇళ్లలో తయారు చేసిన మాస్కులను శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు.

గెట్ టుగెదర్:

లాక్‌డౌన్ తర్వాత ఆప్తులను కలుసుకోవాలని, వారితో సరదాగా గడపాలని చాలా మంది భావిస్తారు. ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీలను ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్, బంధువులను ఆహ్వానించాలని అనుకోవడం సహజం. కొంత కాలంపాటు వీటికి దూరంగా ఉండటం ఉత్తమం. అలాగే ఇంట్లో పెద్ద పెద్ద ఫంక్షన్ల జోలికి కూడా ఇప్పటికిప్పుడు వెళ్లకపోవడం బెటర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here