కరోనా వైరస్ కట్టడికి విధించిన మూడో దశ లాక్డౌన్ మరో వారం రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 3గం.లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో ప్రధాని మాట్లాడనున్నారు. . దేశంలో లాక్డౌన్ మొదలైన తర్వాత ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదోసారి. సోమవారం జరగబోయే సమావేశంలో లాక్డౌన్ అమలవుతున్న విధానం, తాజా పరిస్థితుల గురించి ప్రధాని చర్చించనున్నారని భోగట్టా.
ఈ నెల 17తో లాక్డౌన్ ముగియనుండగా.. పొడిగింపు లేదా ముగింపు లాంటి విషయాల మీద చర్చిస్తారని సమాచారం. అలాగే, గతంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లలో కొందరు ముఖ్యమంత్రులకే మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రధాని.. ఈసారి మాత్రం అందరికీ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
లాక్డౌన్ కారణంగా కార్యక్రమాలు స్తంభించిపోవడంతో రెండో దశలో పలు సడలింపులను ఇచ్చిన కేంద్రం.. మూడో దశలోనూ మరికొన్నింటిని సడలించింది. దేశంలోని మొత్తం 734 జిల్లాలను నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్,గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్లో ఎలాంటి మినహాయింపులను ఇవ్వని కేంద్రం.. గ్రీన్ జోన్లో పూర్తిస్థాయి కార్యకలాపాలకు, ఆరెంజ్ జోన్లో కొన్ని పనులకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.
మూడో దశ లాక్డౌన్లో మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్రం అనుమతించింది. దీంతో దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. అయితే, భౌతికదూరం పాటించాలన్న నిబంధనకు మాత్రం తూట్లు పొడుస్తున్నారు. కిలోమీటర్ల కొద్ది బారులుతీరిన మద్యం ప్రియులు.. కనీసం నిబంధనలు పాటించడంలేదు.
మరోవైపు, కొన్ని రాష్ట్రాలు కంటైన్మెంట్, బఫర్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు నిర్వహించేలా కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో లాక్డౌన్ మెసులుబాటు సమయాన్ని పెంచాలని నిర్ణయించాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేలా.. అలాగే సరి-బేరి సంఖ్యలో దుకాణాలను విభజించేలా ప్రణాళికలను సిద్ధం చేశాయి. అంతేకాదు కేంద్రం సూచనల మేరకు సొంత వాహనాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసినట్లు సమాచారం.