యువతకు బంపరాఫర్.. మూడేళ్లు విధులు నిర్వర్తించేలా సైన్యం కొత్త విధానం!

యువత సహా ఔత్సాహిక పౌరులు ఎవరైనా మూడేళ్ల స్వల్ప కాలానికి దేశ రక్షణలో చేరడానికి వీలు కల్పించే విప్లవాత్మక మార్పులకు సైన్యం శ్రీకారం చుట్టబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సైన్యం పరిశీలిస్తోంది. శత్రువులతో ముందుండి పోరాడటం సహా అన్ని విభాగాల్లో పౌరులకు బాధ్యతలు అప్పగించడంపై సమాలోచనలు జరుపుతోంది. అలాగే, పారామిలటరీ బలగాలు, కేంద్ర సాయుధ దళాల సిబ్బందిని ఏడేళ్ల కాలానికి సైన్యంలో చేర్చుకునే అంశం కూడా పరిశీలనలో ఉంది. కాలపరిమితి పూర్తయిన తర్వాత తిరిగి వారిని మాతృ సంస్థకు పంపే అవకాశముందని ఉన్నత స్థాయి సైనికవర్గాల సమాచారం.

టీఓడీపై వివిధ ఆర్మీ కమాండోల నుంచి ఇప్పటికే ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని సైన్యం అధికార ప్రతినిధి కర్నల్‌ అమన్‌ ఆనంద్‌ వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ప్రయోగాత్మకంగా 100 మంది అధికారులు, 1,000 మంది జవాన్లను నియమించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరులు స్వచ్ఛందంగానే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చునని ఆయన తెలిపారు. అయితే, ఎంపిక అర్హతలు, ప్రమాణాల్లో మాత్రం రాజీపడబోమని, వయసు, ఫిట్‌నెస్‌‌కి ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. ‘ (టీఓడీ)’ లేదా ‘మూడేళ్ల స్వల్ప సర్వీసు’ పథకం కింద ఈ నియామకాలు చేపట్టే అవకాశముంది.

సాధారణ పౌరులకు సైన్యంలో పనిచేసే అవకాశంతోపాటు అనుభవాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్టు సైనికాధికారి ఒకరు తెలిపారు. ‘దేశ పౌరుల్లో జాతీయవాదం, దేశభక్తి గణనీయంగా పెరిగాయి. సైన్యంలో దీర్ఘకాలం సేవలందించాలని భావించనప్పటికీ, ఆ జీవితాన్ని కొన్నాళ్లు ఆస్వాదించాలని కోరుకునే యువత కోసమే ఈ ప్రతిపాదన’ అని పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలో అగ్రశ్రేణి సైనిక కమాండర్ల సదస్సులో చర్చించి, నిర్ణయం తీసుకుంటారు. ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాలలో అనుసరిస్తున్నట్టు నిర్బంధం ఉండదని, భారీ నిరుద్యోగంతో, సాయుధ దళాలలో చేరాలని కోరుకునే యువతకు దేశంలో కొరతలేదని ఓ సీనియర్ అధికారి అన్నారు.

టీవోడీలో భాగంగా ఏడాదిపాటు శిక్షణ, అనంతరం మూడేళ్లపాటు సర్వీసు ఉంటుంది. ఇప్పటికే ఇతర విధుల్లో ఉన్న యువతను కూడా సైన్యంలో చేరేందుకు అనుమతిస్తారు. టీఓడీ వల్ల సైన్యానికి ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రాట్యుటీ, ఎర్నింగ్ లీవ్స్, పెన్షన్ ఇతర ప్యాకేజీల విషయంలో భారీగా ఆదా అవుతుంది. ఈ నిధులను సాయుధ బలగాల ఆధునికీకరణకు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద తొలుత పదేళ్ల కాలానికి విధుల్లోకి తీసుకుంటున్నారు. తర్వాత వారి సర్వీసును మరో నాలుగేళ్ల వరకు పొడిగించేందుకు వీలుంటుంది. ఈ కాలంలో ఒక్కొక్కరికి మొత్తం రూ.6.83 కోట్ల ఖర్చు అవుతుంది. మూడేళ్లలోనే విధులు పూర్తయితే ఆ ఖర్చు రూ.80-85 లక్షలలోపే అవుతుంది. కేవలం వెయ్యిమంది జవాన్లపైనే టీవోడీ ద్వారా దాదాపు రూ.11 వేల కోట్లను ఆదా చేసుకోవచ్చని అంచనా.

నెలవారీ వేతనంతోపాటు, టీవోడీ సర్వీసు ముగిశాక అధికారులకు రూ.6 లక్షలు, జవాన్కు రూ.3 లక్షలు ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం దేశ రక్షణ బడ్జెట్‌లో 60% వరకు నిధులను వేతనాలు, పింఛన్లకే కేటాయించాల్సి వస్తున్న సంగతి గమనార్హం. సైన్యంలో శిక్షణ, విధుల అనంతరం వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం, జవాబుదారీతనం, ఒత్తిడిని అధిగమించడం, బృందంగా పనిచేయడం వంటి నైపుణ్యాలు గణనీయంగా పెరుగుతాయని సైనికాధికారి ఒకరు తెలిపారు. 22-23 ఏళ్ల వయసులో నేరుగా కళాశాలల నుంచి యువతను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కంటే.. సైన్యంలో విధులు నిర్వర్తించిన తర్వాత 26-27 ఏళ్ల వయసులో వారికి కొలువులిచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థలు ప్రాధాన్యమిస్తాయని అంతర్గత సర్వేలో తేలిందని పేర్కొన్నారు.

‘టీఓడీ ఆఫీసర్‌కి నెలకు రూ.80,000-90,000 వరకు వేతనంగా లభించనుంది. మామూలుగా అయితే, ఏదైనా సంస్థలో ఓ గ్రాడ్యుయేట్ చేరితే అతడికి ప్రారంభ వేతనం రూ.30,000-50,000 వేలు మాత్రమే లభిస్తుంది’ ఆయన అన్నారు. ఒక్కో జవాను 17 ఏళ్లు సర్వీసు పూర్తయిన తర్వాత పెన్షన్, ఇతర ప్రయోజనాలు కలుపుకుంటే రూ.11.5 కోట్లు ఖర్చువుతుందని, అదే టీఓడీ జవాన్ నియామకం వల్ల భారీగా నగదు ఆదా అవుతుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here