ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు.. ఆపేది లేదు: ఢిల్లీ సీఎం

క రోనా రోగుల విషయంలో సత్ఫలితాలను ఇస్తోందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రయోగాలను నిలిపివేయడం కుదరదని ఢిల్లీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ రోగుల్లో ప్లాస్మా థెరపీ ప్రభావంతంగా పని చేస్తోందని వివరించారు. ఇటీవల ఓ కరోనా రోగి పరిస్థితి విషమించడంతో అతడికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిచామని.. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడని కేజ్రీవాల్ వెల్లడించారు.

శుక్రవారం (మే 1) ఆన్‌లైన్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో కరోనా కేసుల వివరాలు, చికిత్స విధానంపై కీలక వివరాలు వెల్లడించారు. ప్లాస్మా థెరపీ ప్రయోగ దశలోనే ఉందని.. దీని వల్ల ఇతర సమస్యలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. మహారాష్ట్రలో ప్లాస్మా థెరపీ చేయించుకున్న తొలి రోగి మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది.

ప్లాస్మా థెరపీ ప్రయోగించడానికి అనుమతి ఉన్నవారు మాత్రమే ఆ చికిత్స విధానాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట ఆదేశించింది. అనుమతి లేకుండా ప్లాస్మా థెరపీ చికిత్స అందించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. దీనిపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తదుపరి ప్రకటన చేసేంత వరకు ప్లాస్మాథెరపీ ప్రయోగాలు చేయొద్దని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

అయితే.. ప్లాస్మా థెరపీ ప్రయోగాల ద్వారా తాము మంచి ఫలితాలను పొందుతున్నామని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘మేము ప్లాస్మా థెరపీ ప్రయోగాలను నిలివేయం. ఈ థెరపీ ద్వారా ఫలితాలను పొందుతున్నాం. అయితే.. ప్లాస్మా థెరపీ ప్రయోగ ఫలితాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే దీనికి పరిష్కారం కనుగొంటాం. ప్రస్తుతానికి ఇది ప్రయోగ దశలోనే ఉంది’ అని కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం వల్లే పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కరోనా నుంచి కోలుకున్న 1100 మంది తమ ప్లాస్మాను ఇతర రోగులకు అందించేందుకు సుముఖంగా ఉన్నారని ఆయన తెలిపారు. కరోనా రోగులకు చికిత్సలో తోడ్పడటానికి వారంతా ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 2,300 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం కరోనా కేసులు బాగా పెరిగాయి. మొత్తం 223 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3738కి చేరుకుంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here