ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి వైరస్.. ఒక్క అమెరికాలోనే 10 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అమెరికాలో కోవిడ్-19 తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో అక్కడ మరో 2,494 మంది ప్రాణాలుకోల్పోయారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 55వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది కొవిడ్‌ బారిన పడగా.. 2,06,997 మందిని మహమ్మారి బలితీసుకుంది. ప్రపంచంలో నమోదైన కేసులు, మరణాలను లెక్కిస్తే 6.96 శాతం మంది కోవిడ్‌తో చనిపోయారు. అయితే, ఈ రేటు అన్నిచోట్లా ఒకేలా లేదు. కరోనాను కట్టడి చేస్తున్న దక్షిణ కొరియాలో 2.24 శాతంగా ఉంటే.. ఫ్రాన్స్‌లో ఏకంగా 14 శాతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన అమెరికాలో 5.65 శాతం, భారత్‌లో 3.12 శాతంగా ఉంది. రష్యాల్లో మాత్రం కేవలం 0.91 శాతం మాత్రమే కావడం గమనార్హం.

అగ్రరాజ్యం అమెరికాలో వైరస్‌ బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరోవైపు, వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో నిషేధాజ్ఞల సడలింపు ప్రక్రియ ఊపందుకుంటోంది. పలు రాష్ట్రాల్లో ఆంక్షలను ఈ వారంలోనే పాక్షికంగా ఎత్తివేయనున్నారు. స్పెయిన్‌లో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో 44 రోజుల నిర్బంధ ఆంక్షల అనంతరం తొలిసారిగా ఆ దేశంలో ఇళ్లను వదిలి బయటకు వచ్చేందుకు చిన్నారులను అనుమతించారు. దీంతో పిల్లలు వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతూఆడిపాడారు. కొందరు సైకిళ్లు, మోటారు సైకిళ్లపై దూసుకెళ్తూ హుషారుగా కనిపించారు.

ఇటలీలో ఇప్పుడిప్పుడు పరిస్థితులు కుదుటపడుతున్నాయి. కొత్త కేసుల క్రమేపీ తగ్గుతుండగా… మరణాలు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. ఇటలీ మొత్తం 197,675 మంది వైరస్ బారినపడగా.. 26,856 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా తర్వాత అంత పెద్ద సంఖ్యలో కరోనాతో ఇక్కడే చనిపోయారు. స్పెయిన్‌లో 226,629 మందికి వైరస్ సోకగా.. వీరిలో 23,190 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో లక్షా 62 వేల మందికి వైరస్ సోకగా.. దాదాపు 23వేల మంది బలయ్యారు. జర్మనీలో మాత్రం బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నా మరణాలు మాత్రం తక్కువ శాతమే. 157,770 మంది వైరస్ బారినపడితే.. 5,976 మంది ప్రాణాలు కోల్పోయారు.

బ్రిటన్‌లో ప్రాణనష్టం భారీగానే ఉంది. అక్కడ మరణాలు 20వేల మార్క్ దాటాయి. మొత్తం లక్షా 53వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. టర్కీలో కేసుల సంఖ్య 1.10లక్షలు దాటింది. ఇరాన్‌లో మహమ్మరి కాస్త శాంతించింది. కొత్త కేసులు, మరణాలు గత పది రోజులుగా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. రష్యాలో మాత్రం కేసులు 80వేల దాటినా.. ఇప్పటి వరకూ 747 మంది మాత్రమే చనిపోయారు. కరోనా సోకినట్లు అనుమానాలున్న 1.73 లక్షల మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఇస్కాన్‌ ఆలయానికి చెందిన 31 మంది సభ్యులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారందరినీ విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని 54 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 30 వేలు దాటింది. మృతుల సంఖ్య ఇప్పటివరకు 1,374గా నమోదైంది. లెసొథో, కొమొరొస్‌ మినహా అన్ని ఆఫ్రికా దేశాలకు వైరస్‌ పాకింది.

పాకిస్థాన్‌లో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఆదివారం 1,508 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13 వేలు దాటింది. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రంజాన్‌ మాసంలో సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వ అధికారులు, వైద్య నిపుణులు విజ్ఞప్తి చేశారు. మసీదులకు వెళ్లకుండా ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. పాక్‌లో కొవిడ్‌ దెబ్బకు ఇప్పటివరకు 269 మంది మృతిచెందారు.

సింగపూర్‌లో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో 931 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇజ్రాయెల్‌లో 15 వేలు, జపాన్‌లో 14 వేలు దాటాయి. దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా అక్కడ 10 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో 20 కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఇది వరుసగా తొమ్మిదో రోజు. ఇండోనేసియాలో కొత్తగా 275 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,882కు పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here