పెరిగిన రికవరీ రేటు.. 24 గంటల్లో 1074 మంది డిశ్చార్జ్

దే శంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉన్నా.. అటు కోలుకొని ఇంటికి వెళ్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం శుభసూచకం. గత 24 గంటల్లో దేశంలో 1074 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. రికవరీ రేటు 27.52 శాతంగా ఉందని వివరించారు. దేశంలో సోమవారం (మే 4) సాయంత్రం వరకు 42,836 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 11,762 మంది కోలుకున్నారు.

దేశంలో గత 24 గంటల్లో 2573 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 29,453 యాక్టివ్ కేసులు ఉన్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 83 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1389కి చేరుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే 11 మంది మరణించారు. మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు 13 వేలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా 548 మంది మరణించారు.

Must Read:

తమిళనాడులో సోమవారం కొత్తగా 527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3550కి పెరిగింది. వీరిలో 1409 మంది కోలుకోగా.. 31 మంది మరణించారు. తమిళనాడులో ప్రస్తుతం 2107 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. సోమవారం ఎనిమిది మంది జవాన్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)కి చెందిన ఈ జవాన్లందరూ ఢిల్లీలోని పలు ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతా సంబంధమైన విధుల్లో ఉన్నారు. తాజా కేసులతో కలిపి ఎస్ఎస్‌బీలో కరోనా వైరస్ బారినపడ్డ జవాన్ల సంఖ్య 13కు చేరింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here