దేశంలో 78వేలు దాటిన కరోనా కేసులు.. చైనాకు మరింత చేరువగా

దేశంలో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏప్రిల్‌ వరకు నమోదైన మొత్తం కేసులతో పోలిస్తే మే నెలలో తొలి 13 రోజుల్లో 121% మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. మే 1కి 35 వేలుగా ఉన్న కరోనా కేసులు 12 నాటికి రెట్టింపయ్యాయి. పాజిటివ్ కేసుల రెట్టింపు రోజులు పెరిగినా రోజువారీ సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 78 వేలు దాటింది. వీరిలో 26, 414 మంది కోలుకోగా.. మరో 2,551 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 49వేల మందిలో వైరస్ లక్షణాలు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 3,722 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 134 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,003కి చేరింది.

మే నెల 13 రోజుల్లో రోజుకు సగటున 3,135 చొప్పున మొత్తం 40,757 కేసులు నమోదయ్యాయి. జనవరి 30న దేశంలో తొలి కేసు నమోదు కాగా.. నుంచి ఏప్రిల్‌ 30 వరకు మొత్తం 92 రోజుల్లో సగటు 365 కేసుల చొప్పున 33,610 కేసులు నమోదుకాగా, ఈ 13 రోజుల్లోనే అంతకంటే 10,000 కేసులు ఎక్కువ వచ్చాయి. ఏప్రిల్‌ నెల తొలి 13 రోజుల్లో రోజుకు 611 చొప్పున 7,955 కేసులు నమోదైతే ఈ నెలలో ఈ సంఖ్య కేవలం రెండు రోజుల్లో దాటిపోయింది. గడచిన 24 గంటల్లో 3,500కిపైగా కొత్త కేసులు వచ్చాయి. అలాగే దాదాపు 2వేల మంది కోలుకున్నారు. ఇక, కరోనా నిర్ధారణ పరీక్షల సామర్ధ్యం రోజుకు 95 వేలకు చేరింది. ఇప్పటి వరకు 19.50 లక్షలకుపైగా పరీక్షల నిర్వహించారు.

మరోవైపు, స్పెయిన్‌, బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, టర్కీ, పెరూ, కెనడాల కంటే భారత్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతాయి. గత 24గంటల్లో 13 రాష్ట్రాల్లో సంభవించిన 122 మరణాల్లో 63% మహారాష్ట్ర, గుజరాత్‌లలో చోటుచేసుకున్నాయి. 100కిపైగా కొత్త కేసులు కేవలం 7 రాష్ట్రాల్లోనే వచ్చాయి. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 78వేలు దాటింది. మహారాష్ట్రలో దాదాపు 26వేల మంది వైరస్ బారినపడ్డారు. గుజరాత్ 9,268, తమిళనాడు 9,227, ఢిల్లీ 7,998, రాజస్థాన్ 4,328, మధ్యప్రదేశ్ 4,173, ఉత్తరప్రదేశ్ 3,758, పశ్చిమ్ బెంగాల్ 2,290, ఆంధ్రప్రదేశ్ 2,137, పంజాబ్ 1,927, తెలంగాణ 1,367 కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకుందని భావించిన కేరళలో మళ్లీ కొవిడ్‌-19 కేసుల అలజడి మొదలైంది. తాజాగా మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంటల వ్యవధిలో 10 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు 2,01,196 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. కరోనా విషయంలో ఏ రకంగా చూసినా జాతీయస్థాయితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ సగటు ఎంతో మెరుగ్గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here