దేశంలో 42వేలు దాటిన కరోనా బాధితులు.. గత మూడు రోజుల్లోనే 25 శాతం నమోదు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా దాదాపు 2,700మందికి కొత్తగా వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,500వేలు దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 83 మంది కరోనాకు బలయ్యారు. ఒక్కరోజులో ఇంత గరిష్ఠ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పాజిటివ్ కేసుల్లో ముందున్న రికార్డులను ఆదివారం బ్రేక్ చేసింది. అయితే, మహమ్మారి బారినపడి 11,775 మంది కోలుకోవడం సానుకూలం. మొత్తం కరోనా మరణాలు 1,391కి చేరాయి.

మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. అయితే దేశంలో పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పని లేదని, కేసుల్లో వృద్ధి నిలకడగానే ఉందని కేంద్రం ప్రకటించింది. కేసులు పదివేల నుంచి 20 వేలకు చేరడానికి 9 రోజులు, 20 వేల నుంచి 40 వేలకు చేరడానికి 12 రోజులు పట్టిందని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 25 శాతం గత మూడు రోజుల్లోనే నమోదయ్యాయి.

పంజాబ్‌లో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం 415 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ఆదివారం మరో 330 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,102కి చేరింది. రెండు రోజుల్లో 740 కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల రేటు 200 శాతం పెరిగింది. మహరాష్ట్రలో ఆదివారం మరో 678 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 13వేలకు చేరువయ్యింది. గడచిన 24 గంటల్లో మరో 27 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మొత్తం మరణాలు 548కి చేరాయి. గుజరాత్‌లోనూ కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా 374 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 5,428గా నమోదయ్యింది.

ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ నుంచి మినహాయింపులను సోమవారం నుంచి అమలుచేయాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుండగా ఆదివారం పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం 427 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 4,590 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. దేశంలో ఆదివారం సంభవించిన 83 కరోనా మరణాల్లో 73 కేవలం మూడు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో 36 మంది, గుజరాత్‌లో 26 మంది, మధ్యప్రదేశ్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

హర్యానాలో రికార్డు స్థాయిలో 66 మందికి కొత్తగా కరోనా సోకింది. అత్యధికంగా ఫరీదాబాద్‌ జిల్లాలో బాధితులు ఉన్నారు. చండీగఢ్‌లోనూ తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. కరోనా బారినపడ్డ 82 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ చనిపోయింది. జమ్మూ కశ్మీర్‌లో కొత్తగా 35 మంది వైరస్ బారినపడ్డారు. లడఖ్‌లోనూ మరో 19 కేసులు నిర్ధారణ అయ్యాయి.

మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో వైరస్‌బారిన పడ్డ ముగ్గురూ కోలుకోవడంతో ఆ రాష్ట్రాలు కోవిడ్-19 ఫ్రీ స్టేట్స్‌గా మారాయి. అసోం, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌, మేఘాలయ, పుదుచ్చేరిల్లో కొత్త కేసులేమీ రాలేదు. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 274 మంది కోలుకోగా తర్వాతి స్థానాల్లో గుజరాత్‌ (161), మహారాష్ట్ర (121) ఉన్నాయి.

మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తర్వాత తమిళనాడులో 3,023 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఆదివారం మరో 266 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అటు మధ్యప్రదేశ్‌లోనూ 2,887 మంది వైరస్ బారినపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 58 కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కరోనా బాధితులు 1,583 చేరారు. తెలంగాణలోనూ ఆదివారం మరో 21 కేసులు బయటపడటంతో మొత్తం బాధితుల సంఖ్య 1,082కి చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here