దే శంలో కరోనా కేసులు 40 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2487 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ఆదివారం (మే 3) సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 40,263కు చేరుకుంది. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కాగా.. వివిధ ఆస్పత్రుల్లో 28,070 మంది చికిత్స పొందుతున్నారు.
దేశంలో ఇప్పటివరకు 1306 మంది కరోనా వల్ల మరణించారు. గత 24 గంటల్లో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉండటం శుభసూచకం. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10,887 బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు సుమారు 27 శాతంగా ఉంది. మరణాల రేటు 3.2 శాతంగా ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల కంటే భారత్లో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు.. మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 12,296కు చేరింది. ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహారాష్ట్ర తర్వాతి స్థానంలో గుజరాత్ (5054), ఢిల్లీ (4122), మధ్యప్రదేశ్ (2846), రాజస్థాన్ (2770) రాష్ట్రాలు ఉన్నాయి.
Also Read: