దేశంలో కొవిడ్-19 చికిత్స దిశగా కీలక అడుగు.. రోగులపై పరీక్షకు ఫవిపిరవిర్‌ డ్రగ్

భా రత్‌లో కరోనా వైరస్ చికిత్స దిశగా కీలక అడుగు పడింది. కొవిడ్‌-19 చికిత్సలో సత్ఫలితాలు ఇస్తుందని భావిస్తున్న యాంటీ-వైరల్‌ ఔషధం ‘ఫవిపిరవిర్‌’ క్లినికల్‌ ట్రయల్స్‌ మూడో దశకు చేరుకున్నాయి. కీలకమైన మూడో దశలో భాగంగా దీన్ని కొవిడ్‌-19 రోగులపై పరీక్షించనున్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ ఔషధ సంస్థ ‘గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌’ ఈ డ్రగ్‌ను రూపొందించింది. ఈ ఔషధాన్ని పరీక్షించేందుకు ఈ సంస్థకు ‘డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)’ ఏప్రిల్ నెలలోనే అనుమతులు ఇచ్చింది.

కొవిడ్‌-19ను నయం చేసే సామర్థ్యంపై జరుపుతున్న పరీక్షల్లో దేశంలో మూడో దశకు చేరిన తొలి సంస్థ తమదేనని ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము ఉత్పత్తి చేసిన ‘ఫవిపిరవిర్‌’ డ్రగ్ సమర్థంగా పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనిపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని.. దేశంలోని 10 ఆస్పత్రులు ఈ పరిశోధనలో పాల్పంచుకుంటున్నాయని తెలిపింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నట్లు గ్లెన్‌మార్క్‌ వెల్లడించింది.

జులై లేదా ఆగస్టు నాటికి ఈ పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉందని గ్లెన్‌మార్క్‌ తెలిపింది. రోగుల చికిత్సకు సంబంధించిన అధ్యయనానికి 14 రోజులు, అధ్యయనం మొత్తం పూర్తవడానికి 28 రోజులు పడుతుందని వివరించింది. ఈ డ్రగ్‌ తయారీకి కావాల్సిన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌ (ఏపీఐ), సంబంధిత ఫార్ములాలను కూడా రూపొందించినట్లు పేర్కొంది.

Must Read:

అటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘భారత్ బయోటెక్’ ఔషధ దిగ్గజం కూడా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కొవిడ్-19 వ్యాక్సిన్‌పై చేస్తున్న ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆగస్టు నాటికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్.. సోమవారం ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

జపాన్‌లో ప్రబలిన ఇన్‌ఫ్లుయంజా వ్యాధిగ్రస్థుల చికిత్స కోసం ఫవిపిరవిర్‌ను అభివృద్ధి చేశారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న వేళ చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో బాధితులకు ఈ ఔషధాన్ని ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. దీనివల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. జపాన్‌కు చెందిన టొయామా కెమికల్‌ అనే కంపెనీకి చెందిన ‘అవిగన్‌’ అనే బ్రాండ్‌కు ఫవిపిరవిర్‌ జనరిక్‌ ఔషధం కావడం గమనార్హం.

తమ ప్రయోగాలు విజయవంతమైతే కరోనా మహమ్మారి చికిత్సలో ముందడుగు పడినట్లేనని గ్లెన్‌మార్క్ సంస్థ ఉపాధ్యక్షురాలు మోనికా టాండన్‌ పేర్కొన్నారు. తమ పరిశోధనల ఫలితాల గురించి ఔషధ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణకు ఎలాంటి వ్యాక్సిన్ లేని ప్రస్తుత తరుణంలో వైరస్ కట్టడిలో ‘ఫవిపిరవిర్‌’ కీలకంగా మారనుందని ఆమె చెప్పారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here